మ్యాన్హోల్స్ను శుభ్రం చేస్తూ చని పొతే 30 లక్షల నష్టపరిహారం
సుప్రీంకోర్టు సంచలన తీర్పు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మ్యాన్హోల్ పారిశుద్ధ్య కార్మికుల మరణాల నేపథ్యంలో సుప్రీంకోర్టు ఇవాళ కీలక తీర్పు ఇచ్చింది. మ్యాన్హోల్స్ను శుభ్రం చేస్తూ ప్రాణాలు విడుస్తున్న కార్మికులకు స్థానిక ప్రభుత్వాలు 30 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఓ కేసులో తెలిపింది. జస్టిస్ ఎస్ రవీంద్ర భట్, అరవింద కుమార్లతో కూడిన ధర్మాసనం ఈ తీర్పునిచ్చింది. మాన్యువల్ స్కావెంజర్గా పనిచేస్తూ వైకల్యానికి గురైతే వారికి 20 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు తెలిపింది. మాన్యువల్ స్కావెంజింగ్ కార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రయత్నం చేయాలని ధర్మాసనం అభిప్రాయపడింది. స్వల్ప స్థాయిలో ఎవరైనా డ్రైనేజీ వర్కర్కు వైకల్యం సంభవిస్తే వారికి 10 లక్షలు ఇవ్వాలని కోర్టు తీర్పునిచ్చింది. సెప్టిక్ ట్యాంకులు క్లీన్ చేస్తూ గత అయిదేళ్లలో దేశంలో సుమారు 347 మంది మరణించారు. దాంట్లో యూపీ, తమిళనాడు, ఢిల్లీ రాష్ట్రాలు ముందున్నాయి.