ప్రకృతి వైపరీత్యాల సమస్యలపై అబాండాలు సరికాదు     

- శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ప్రకృతి వైపరీత్యాల సమస్యలపై అబాండాలు సరికాదని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ అంశంలో కూడా జరుగుతున్నదని, ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్‌ పార్టీ పని అని విమర్శించారు. నల్లగొండలోని తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో మొదటి స్థానంలో ఉందన్నారు. దేశానికే తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని చెప్పారు. మళ్లీ కేసీఆర్ రావాలని, మూడోసారి ముఖ్యమంత్రి కావాలన్నారు. ఎవరు ఎన్ని కుట్రలు పన్నినా ప్రజలు కేసీఆర్‎నే నమ్ముతారని స్పష్టం చేశారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 స్థానాలను బీఆర్‌ఎస్‌ గెలుస్తుందని నమ్మకం వ్యక్తంచేశారు. ప్రస్తుత పరిస్థితులల్లో తనపై కూడా కొన్ని అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని, వాటిని నమ్మొద్దని సూచించారు. తాను ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీ విజయం కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. కొన్ని కారణాల వల్ల కొంతమంది ఎమ్మెల్యేలు తనతో విడిపోవచ్చని, అయినా వారి విజయాన్నే కోరుకుంటున్నాని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో అన్ని నియోజకవర్గాల్లో తనకు అభిమానులు, మిత్రులు ఉన్నారని.. బీఆర్ఎస్‎ని, కేసీఆర్‎నే గెలిపించాలని వారందరికి విజ్ఞప్తి చేస్తున్నానని చెప్పారు.ఈ వయస్సులో తాను పార్టీలు మారాల్సిన అవసరం లేదని వెల్లడించారు. పార్టీ ఆదేశిస్తే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తాను కానీ, తన కుమారుడు కానీ పోటీ చేస్తామన్నారు. అంతే కానీ పార్టీ మారేదిలేదని తెలిపారు. అవసరమైతే ఈ పార్టీ నుంచే ఇప్పుడే పోటీచేసే వాడినని చెప్పారు. పక్క పార్టీలోకి వెళ్లి పోటీచేయాల్సిన అవసరం లేదని వెల్లడించారు. కేసీఆర్ మాత్రమే తెలంగాణకు శ్రీరామరక్ష. తెలంగాణ బాగుండాలంటే కేసీఆర్ ఘన విజయం సాధించాలన్నారు.

Leave A Reply

Your email address will not be published.