ఎన్ఇసిఇఆర్టి ప్యానల్‌ కమిటీ ప్రతిపాదనలపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి ఆగ్రం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: దేశవ్యాప్తంగా అన్ని పాఠశాలల పాఠ్య పుస్తకాల్లో ‘ఇండియా’ అనే పదాన్ని ‘భారత్‌’గా మార్చాలంటూ ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్ ఎడ్యుకేషనల్‌ రిసెర్చ్‌ అండ్‌ ట్రెయినింగ్‌ కు సంబంధించిన ప్యానల్‌ కమిటీ చేసిన ప్రతిపాదనలపై ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమి పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్‌, ఆర్జేడీ, శివసేన, డీఎంకే తదితర పార్టీ నేతలు బీజేపీ సర్కారు తీరుపై విమర్శనాస్త్రాలు సంధించారు.శివసేన (UBT వర్గం) ఎంపీ సంజయ్‌ రౌత్‌ మాట్లాడుతూ.. ఇదో రాజకీయ నిర్ణయం అన్నారు. ఇండియా కూటమి ఏర్పాటైనప్పటి నుంచే బీజేపీ నేతలు దాన్ని ద్వేషించడం మొదలుపెట్టారని విమర్శించారు. ప్రభుత్వ విధానాలన్ని ఇండియా పేరుతో నడుస్తున్నప్పుడు ఇండియా అనే పదాన్ని తొలగించి, దాని స్థానంలో భారత్‌ అనే పదాన్ని చేర్చడానికి.. బీజేపీ సర్కారు అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి చర్చించాల్సిన అవసరం లేదా..? అని ప్రశ్నించారు.కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ కేసీ వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. వాళ్లు చాలా మార్పులు చేస్తున్నారని, పాఠ్య పుస్తకాల ద్వారా, పాఠ్యాంశాల ద్వారా, ఇలా ప్రతి అవకాశాన్ని వాడుకుని ఇండియా చరిత్రను రూపుమాపుతుండటం మీరు చూస్తున్నారని బీజేపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇండియా, భారత్‌ రెండూ సమాన పదాలేనని, అలాంటప్పుడు ఇండియా అనే పదాన్ని తొలగించడం దేనికో అర్థం కావడం లేదని అన్నారు.డీఎంకే నేత ఇళంగోవన్‌ మాట్లాడుతూ.. ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు తమ కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నందుకే కేంద్ర సర్కారు అంతటా ఆ పదాన్ని తొలగిస్తోందని ఆరోపించారు. ఇదొక చౌకబారు, అనవసర నిర్ణయమని వ్యాఖ్యానించారు.

Leave A Reply

Your email address will not be published.