కాంగ్రెస్ పార్టీలోకి మాజీ సీఎం కుమారుడు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో మరో నెల రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు దాదాపు అభ్యర్థులను ప్రకటించాయి. ఇక పలు పార్టీల్లో టికెట్లు ఆశించి భంగపడ్డ నేతలు జంపింగ్లు చేస్తున్నారు. ఇప్పడున్న పార్టీలో రాజకీయ భవిష్యత్తు లేదని భావించి పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు ఎక్కువగా ఉంటున్నాయి. ఇప్పటికే చాలా మంది నేతలు కండువాలు మార్చేశారు.తాజాగా.. మాజీ సీఎం జలగం వెంగళరావు కుమారుడు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు బీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ గూటికి చేరేందుకు సిద్ధమయ్యారు. నేడు ఢిల్లీలో రాహుల్ గాంధీ సమక్షంలో ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. కొత్తగూడెం నుంచి బీఆర్ఎస్ టికెట్ ఆశించగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు మరోసారి టికెట్ ఇవ్వటంతో గత కొంతకాలంగా మనస్థాపంతో ఉన్న పార్టీ మారేందురు సిద్ధమయ్యారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆఫర్ రావటంతో ఆ పార్టీలో చేరేందుకు సిద్దమయ్యారు.జలగం వెంకటట్రావు, తన తండ్రి ప్రాతినిధ్యం వహించిన సత్తుపల్లి నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచే ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి టీడీపీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్ఎస్ (బీఆర్ఎస్)లో చేరిన ఆయన.. 2014లో టీఆర్ఎస్ తరపున కొత్తగూడెం శాసనసభ నియోజకవర్గం నుండి పోటిచేసి వైసీపీ అభ్యర్థి వనమా వెంకటేశ్వరరావును ఓడించారు. 2014లో ఖమ్మం జిల్లా నుండి గెలిచిన తొలి, ఏకైక టీఆర్ఎస్ ఎమ్మెల్యే జలగం కావటం విశేషం.2018లోనూ టీఆర్ఎస్ తరపున కొత్తగూడెం నియోజకవర్గం నుండి పోటి చేయగా.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వనమా చేతిలో ఓడిపోయాడు. ఆ తర్వాత వనమా వెంకటేశ్వరరావు తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆయన ఎన్నిక చెల్లదని హైకోర్టును ఆశ్రయంచారు. ఈ కేసు విచారించిన తెలంగాణ హైకోర్టు వనమా ఎన్నిక చెల్లదని.. ఈ ఏడాది జులైలో తీర్పు వెల్లడించింది. దీంతో 2018లో ఎన్నికల్లో రెండో స్థానంలో నిలిచిన జలగం వెంకటరావును కోర్టు ఎమ్మెల్యేగా ప్రకటించింది. ఆ తర్వాత వనమా సుప్రీం కోర్టును ఆశ్రయించటంతో హైకోర్టు తీర్పుపై స్టే విధించింది.అయితే ఈసారి తనకు బీఆర్ఎస్ నుంచి అవకాశం వస్తుందని గంపెడు ఆశలు పెట్టుకున్న జలగంకు నిరాశే ఎదురు కావటంతో పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. నేడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు.