తమిళనాడు రాష్ట్రాన్ని ముంచేత్తిన భారీ వర్షాలు

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: తమిళనాడు రాష్ట్రాన్ని భారీ వర్షం ముంచెత్తింది. చెన్నై సహా పలు ప్రధాన నగరాల్లో శుక్రవారం నుంచి వర్షం కురుస్తోంది. భారీ వర్షం కారణంగా చెన్నైలోని ప్రధాన రహదారులు మోకాళ్ల లోతు నీటితో నిండిపోయాయి. పలు కాలనీల్లోకి వరదనీరు వచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రానున్న మూడు రోజులు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెన్నై వాతావరణ కేంద్రం హెచ్చరించింది.చెన్నైలో శనివారం ఉదయం నుంచి కూడా భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షం కారణంగా నగరంలోని పలు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో కార్యాలయాలకు వెళ్లే వారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రానున్న రోజుల్లోనూ చెన్నైలో వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) అంచనా వేసింది. మరోవైపు భారీ వర్షం నేపథ్యంలో చెన్నైలోని పాఠశాలలు, కళాశాలలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది.ఇక గత 24 గంటల్లో తమిళనాడులోని చిదంబరంలో అత్యధికంగా 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అదనపు డైరెక్టర్‌ జనరల్‌ ఎస్‌ బాలచంద్రన్‌ తెలిపారు. అదేవిధంగా తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్‌లలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.