మహిళ రిజర్వేషన్ల కొరకు ఎమ్మెల్సీ కవిత మరో పోరాటం

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: మహిళా రిజర్వేషన్ల కోసం ప్రతిపక్షాల మద్దతు కోరుతూ ఢిల్లీలో ఎమ్మెల్సీ కవిత ఆందోళనలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నెలల వ్యవధిలోనే కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టింది. దాదాపుగా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు ఆమోదం లభించింది. లోక్ సభ స్థానాల పునర్వ్యవస్థీకరణ తర్వాత మహిళా రిజర్వేషన్లను అమలు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. లోక్ సభ స్థానాలకు మహిళా రిజర్వేషన్లకు సంబంధం లేదని ప్రతిపక్షాలు కేంద్రం తీరును తప్పుబట్టాయి.  లిక్కర్ కేసు తెర మీదికి వచ్చిన సందర్భంలోనే ఆమె ఢిల్లీలో మహిళల రిజర్వేషన్ల కోసం పోరాడారు. తాజాగా, మరోమారు ఆమె అరెస్టు గురించి కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్, ఇతర బీజేపీ నేతలు మాట్లాడిన సందర్భంలో తాజా ప్రకటన రావడం ఆశ్చర్యకరంగా ఉన్నది.  తాజాగా, భారత్ జాగృతి అధినేత, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరో పోరాటానికి సన్నద్ధం అవుతున్నారు. 2029 ఎన్నికలకు కాదు.. తక్షణమే మహిళా రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తమ పోరాటానికే కేంద్ర ప్రభుత్వం దిగి వచ్చి మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని తెచ్చిందని అన్నారు. అయితే, చట్టంగా మారిన తర్వాత మహిళల రిజర్వేషన్లను అమలు చేయడంలో జాప్యం వహించే కుట్రలు చేస్తున్నారని పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్లను తక్షణమే అమలు చేయాలని పలు పార్టీలు, సంస్థలు డిమాండ్ చేస్తున్నాయని, తాను వాటికి మద్దతు ఇస్తున్నట్టు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వివరించారు. ఇప్పటికే సుప్రీంకోర్టులో మహిళా రిజర్వేషన్లకు సంబంధించి పిటిషన్‌లు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు.  మహిళా రిజర్వేషన్ల తక్షణ అమలు కోసం తాము న్యాయపోరాటం చేస్తామని కవిత చెప్పారు. ఇది వరకే పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లో తాము ఇంప్లీడ్ అవుతామని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.