మూడు గంటల కరెంటు చాలని నేను అనలేదు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఉచిత విద్యుత్‌కు సంబంధించి సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు కౌంటరిచ్చారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మంగళవారం జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. 24 గంటల కరెంట్ వద్దు, 3 గంటల కరెంట్ చాలు అని తాను ఎక్కడ అన్నానో చూపించాలని సవాల్ విసిరారు. 24 గంటల విద్యుత్‌ను బీఆర్ఎస్ ఇవ్వకుంటే.. బీఆర్ఎస్ నేతలు రైతులకు క్షమాపణలు చెప్పాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  ఏ సబ్‌స్టేషన్‌కైనా పోదామని.. 24 గంటల కరెంట్ ఇస్తుంటే, తాము నామినేషన్ కూడా వేయకుండా ఇంటి పోతామని ఆయన చురకలంటించారు. ఆలంపూర్ జోగులాంబ ఆలయాన్ని వంద కోట్లతో అభివృద్ధి చేస్తానని కేసీఆర్ చెప్పారని.. ఇవాళ ఆ గుడి పరిస్ధితి ఎలా వుందో చూడాలని రేవంత్ దుయ్యబట్టారు. ఉచిత విద్యుత్ ఆలోచన కాంగ్రెస్ పార్టీదేనని ఆయన అన్నారు. నీలం సంజీవరెడ్డిని కాంగ్రెస్ రాష్ట్రపతిని చేస్తే.. వెంకట్రామిరెడ్డి ఇప్పుడేం చేస్తున్నారని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. చల్లా వెంకట్రామిరెడ్డి.. కల్వకుంట్ల కుటుంబం దగ్గర బానిసగా మారిపోయారని ఆయన చురకలంటించారు.  ఆర్డీఎస్ పంచాయతీని కర్ణాటక ప్రభుత్వంతో కలిసి పరిష్కరించే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. బోయల్ని ఎస్టీల్లో చేరుస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని ఆయన ఎద్దేవా చేశారు. ధరణి రద్దు చేస్తే రైతుబంధు ఎందుకు రాదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ధరణి అనేది బీఆర్ఎస్‌కు ఏటీఎంలా మారిందని ఆయన ఆరోపించారు. సంపత్‌ను కాదని మీరు అబ్రహాన్ని గెలిపిస్తే.. ఇప్పుడు అబ్రహాన్ని తప్పించి మరొకరిని రప్పించారని రేవంత్ దుయ్యబట్టారు. బోయలకు ఎమ్మెల్సీ ఇచ్చే బాధ్యత కూడా తనదేనని ఆయన అన్నారు. పాలమూరు గడడపై 14కు 14 సీట్లు కాంగ్రెస్ పార్టీ గెలవాలని పీసీసీ చీఫ్ ఆకాంక్షించారు. మన ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారని. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీదేనని రేవంత్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.