భారీ మెజారిటీతో గెలిచిన రేవంత్ రెడ్డి

తెలంగాణ జ్యోతి /వెబ్ న్యూస్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టే దిశగా దూసుకుపోతోంది. ఇప్పటికే ఐదు స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. తాజాగా టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా కొడంగల్ నియోజకవర్గం నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆయన  32,800 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.  కాంగ్రెస్ తరుఫున సీఎం అభ్యర్థిగా భావిస్తున్న రేవంత్ రెడ్డి రెండు ఈ ఎన్నికల్లో రెండు అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారు. అందులో తన సొంత నియోజకవర్గం కొండగల్ కాగా.. మరొకటి కామారెడ్డి నియోజకవర్గం. పార్టీ హైకమాండ్ సూచన మేరకు రేవంత్ రెడ్డి సీఎం కేసీఆర్ పై పోటీ చేసేందుకు కామారెడ్డి నుంచి బరిలోకి దిగారు. అయితే ఈ స్థానంలో కూడా ఆయన ఆధిక్యంలో దూసుకుపోతున్నారు.  తెలంగాణ ఎన్నికల ఫలితాలు లైవ్ అప్‌డేట్స్ రేవంత్ రెడ్డి కొడంగల్ లో 2009, 2014లలో రేవంత్ రెడ్డి తెలుగుదేశం పార్టీ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధిచారు. అయితే 2018లో వచ్చిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ (అప్పుడు టీఆర్ఎస్) అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. తరువాత వచ్చిన లోక్ సభ ఎన్నికల్లో మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ తరఫున ఎంపీగా గెలుపొందారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో కొండగల్ భారీ మెజారిటీతో గెలిచిన ఆయన.. కామారెడ్డిలో కూడా గెలుపొందే అవకాశాలు కనిస్తున్నారు.  కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాల్లో గెలుపుదిశగా పయనిస్తుండటంతో  ఆ పార్టీ కార్యకర్తలు గాంధీ భవన్ కు చేరుకొని సంబరాలు మొదలుపెట్టారు. అక్కడ ఆ పార్టీ శ్రేణులు డ్యాన్సులు చేస్తూ, టపాకులు కాలుస్తూ కేరింతలు కొడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ కార్యాలయాల్లో హడావిడి కనిపిస్తోంది. పలు చోట ఆ పార్టీ కార్యకర్తలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి ఫ్లెక్సీలకు పాలాభిషేకాలు చేయడం కనిపిస్తోంది. ఇప్పటికే రేవంత్ రెడ్డి, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్ గాంధీ భవన్ కు చేరుకున్నారు. కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు.

Leave A Reply

Your email address will not be published.