కరాచీ బేకరి అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాజేంద్రనగర్లోని కరాచీ బేకరీ గోడౌన్లో జరిగిన అగ్ని ప్రమాద సంఘటనపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో గాయపడ్డ 15 మంది కార్మికులకు మెరుగైన వైద్య చికిత్సలు అందచేయాలని సంబంధిత ఆధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. గాయపడ్డ వారిలో ఎక్కువగా ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చిన కార్మికులు ఉన్నారని సీఎంకు అధికారులు తెలియజేశారు. గాయపడ్డ వారిలో 8 మందిని కంచన్ బాగ్ డీఆర్డీఓ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సదుపాయాలు అందచేయాలని వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు.కాగా.. రాజేంద్రనగర్లోని కరాచీ బేకరీలో సిలిండర్ పేలింది. కరాచీ బేకరీ క్యాంటీన్లో ఒక్కసారిగా ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. దాదాపు 15 మందికి గాయాలవగా.. పలువురి పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేశారు. తీవ్రంగా గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే ప్రమాదం తర్వాత సిబ్బంది, యాజమాన్యం ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. గుట్టుచప్పుడు కాకుండ బాధితులను సిబ్బంది ఆస్పత్రికి తరలించిన.. నిర్వాహకులు కిచెన్తో పాటు గోదాంకు తాళం వేసుకొని వెళ్లిపోయారు.