కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి పై సీఎం రేవంత్ రెడ్డి సీబీఐ విచారణకు ఆదేసించాలి 

    బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి విషయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ప్రశ్నించారు. కాళేశ్వరం పై వివరాలు ఇవ్వాలని కాగ్ పలు దఫాలుగా కోరినా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని తెలిపారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ చేయించాలని రేవంత్ రెడ్డి గతంలో డిమాండ్ చేశారని గుర్తు చేశారు. కాళేశ్వరం పేరుతో కేసీఆర్ లక్ష కోట్లు దోచుకున్నాడు… ఆ డబ్బులను వసూలు చేసి పేద ప్రజల అకౌంట్స్ లో వెస్తానని గతంలో రాహుల్ అన్నారని గుర్తుచేశారు. రేవంత్ రెడ్డి ఇప్పుడు సీబీఐ విచారణకు ఎందుకు ఆదేశించడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో రేవంత్ కు ఉన్న అభ్యంతరం ఏంటి? ఎందుకు లేఖ రాయడం లేదు? అంటూ ప్రశ్నలు సంధించారు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా.. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను మెడిగడ్డ వరకే పరిమితం చేయాలని కుట్ర జరుగుతోందని కాంగ్రెస్ పార్టీ మీద అనుమానం వ్యక్తం చేశారు. కాళేశ్వరం మొత్తం మీద విచారణ జరగాలన్నారు. స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఒక వ్యక్తి చేసిన అతిపెద్ద అవినీతి కాళేశ్వరం ప్రాజెక్ట్ అని తెలిపారు. సాక్ష్యాధారాలు ఉన్నాయని గతంలో రేవంత్ రెడ్డి.. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి లేఖ రాశారని గుర్తు చేశారు. ఇప్పుడు సీఎం గా తన దగ్గర ఉన్న ఆధారాలను పంపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకట్ రెడ్డి గారితో పాటు, రాష్ట్ర కార్యదర్శి ఉమారాణి గారు, రాణా ప్రతాప్ గారు, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.