ఇతర రాష్ట్రాలలో పంట ఉత్పత్తులు డిమాండ్లను అధ్యయనం చేయాలి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పంట ఉత్పత్తులను సకాలంలో రైతుల నుంచి సేకరించి రైతులకు అండగా నిలబడాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. శుక్రవారం నాడు తెలంగాణ మార్కెఫెడ్ కార్యకలాపాలపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఎరువుల సరఫరా, పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై మంత్రి ఆరా తీశారు. రైతులకు మద్దతు ధర వివరాలను తెలుసుకున్నారు. ఈ సమీక్షలో మార్కెఫెడ్ జనరల్ మేనేజర్, మేనేజర్ ప్రొక్యూర్మెంట్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ… ఇతర రాష్ట్రాలతో సమన్వయం చేసుకొని పంట ఉత్పత్తుల డిమాండ్లను అధ్యయనం చేయాలని మంత్రి ఆదేశించారు. ఇతర రాష్ట్రాల మార్కెఫెడ్ నిర్వహించే కార్యకలాపాలను తెలుసుకొని విధానాలు రూపకల్పన చేయాలని చెప్పారు. సహాకార సంఘాల ద్వారా రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. యూరియా వినియోగం తగ్గించే విధంగా రైతులకు అవగాహన కార్యక్రమాలను రూపొందించాలని చెప్పారు. మార్కెఫెడ్ చేపట్టే అన్ని కార్యకలాపాలు రైతులకు అండగా ఉండేలా ఉపయోగపడాలన్నారు. సంస్థ నష్టాలను తగ్గించుకొని లాభాలను గడించే విధంగా సంస్థ చర్యలు తీసుకోవాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు.