వైకుంఠ ఏకాదశి.. నారాయణుడి నామఃస్మరణలతో మార్మోగుతున్న ఆలయాలు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా విష్ణుమూర్తిని దర్శించుకునేందుకు శనివారం తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయాల దగ్గర బారులు తీరారు. యాదగురిగుట్టలో ఉదయం 6.42 గంటలకు ఉత్తర రాజ గోపురం చెంత నరసింహుడు మహావిష్ణువు రూపంలో దర్శనమిచ్చారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ విప్ బీర్ల అయిలయ్య కుటుంబసభ్యులతో నరసింహస్వామిని దర్శించుకున్నారు. భద్రాచలంలోనూ అధ్యయనోత్సవాల్లో భాగంగా వైకుంఠ ఏకాదశి వేడుకలను నిర్వహించారు. వైకుంఠ ద్వారం గుండా దర్శనమిస్తున్న స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు.వైకుంఠ ఏకాదశి సందర్భంగా ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో తెల్లవారుజామున 2.30 గంటల నుంచే స్వామివారి మూల విరాట్లకు మహా క్షీరాభిషేకం నిర్వహించారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. సంగారెడ్డి వైకుంఠపురంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి సందర్భంగా నిర్వహించిన పల్లకి సేవలో మంత్రి దామోదర రాజనర్సింహ దంపతులు పాల్గొన్నారు. సిద్దిపేటలో ఎమ్మెల్యే హరీశ్రావు వైకుంఠ ద్వార దర్శనం చేసుకున్నారు. సిరిసిల్లలోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్తర ద్వారం గుండా గరుడవాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిస్తున్నారు.