యువకుడిని చంపేందుకు యత్నించిన బీజేపీ నాయకుడు,మరో ఐదుగురిపై కేసు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఓ యువకుడిని చంపేందుకు యత్నించిన బీజేపీ నాయకుడు ఉష్కం రఘుపతితో పాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఆదిలాబాద్ డీఎస్పీ ఉమేందర్ తెలిపారు. ఆదిలాబాద్ పట్టణంలో ఐదు రోజుల కిందట వంశీ అనే యువకుడిపై హత్యాయత్నం జరిగింది.తన కూతురితో వంశీ సన్నిహితంగా ఉండడాన్ని గమనించిన రఘుపతి.. అతన్ని హత్య చేయించడానికి ప్రణాళిక రూపొందించాడు. పాత నేరస్థుడు రవితో రూ. 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాడు. ఈనెల 18న రవి మరో వ్యక్తి అశోక్తో కలిసి స్కూటీపై వెళ్తున్న వంశీని వెనుక నుంచి జీపుతో ఢీకొట్టారు. దీంతో వంశీకి గాయాలయ్యాయి. వంశీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో బీజేపీ నాయకుడు రఘుపతితో పాటు ఆయన భార్య అరుంధతి, జోహాన్ రవి, అశోక్, దిల్షాన్, రాజులపై మావల పోలీసులు కేసు నమోదు చేశారు. జోహన్ రవి, అశోక్, దిల్షాన్, రాజులను అదుపులోకి తీసుకోగా, రఘుపతి, అరుంధతి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.