తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్కుమార్ ఏపీలో అధికార వైసీపీ భవిష్యత్పై అనుమానాలు వ్యక్తం చేశారు. పార్టీ లక్ష్యాలు, ఆశాయాలను పాటించకపోతే రాబోయే రోజుల్లో వైసీపీ మనుగడ కష్టమేనని అన్నారు. శనివారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాబోయే ఎన్నికల సందర్భంగా ఏపీ సీఎం వైఎస్ జగన్ పార్టీ పరంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో తీసుకుంటున్న చర్యలపై స్పందించారు.ప్రస్తుతమున్న సిట్టింగ్ ఎమ్మెల్యేలపై స్థానికంగా ఉన్న వ్యతిరేకత అనే సాకుతో వారిని మార్చడం అనే ప్రక్రియ అన్ని సమయాల్లో సముచితం కాదని సూచించారు. సీట్ల మార్పుపై వ్యూహాత్మకంగా వ్యవహరించక పోతే నష్టం తప్పదని హెచ్చరించారు. సగం వరకు సిట్టింగ్ స్థానాల్లో మార్పులు, చేర్పులు చేస్తుండడం వల్ల సొంత పార్టీ నాయకులే వ్యతిరేకిస్తున్నారని, దీని వల్ల రాబోయే ఎన్నికల ఫలితాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని పేర్కొన్నారు.వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చి ఎమ్మెల్యేలకు పవర్ లేకుండా చేయడంతో ఎమ్మెల్యేల పని సామర్ధ్యం ఎక్కడ పెరుగుతుందని అన్నారు. సంక్షేమాల పేరిట ప్రభుత్వ నిధులను ప్రజలకు పంపిణీ చేయడం ఒక్కటే సరిపోదని వెల్లడించారు.