వీధి కుక్కల దాడిలో 5 నెలల పసికందు మృతి

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: హైదరాబాద్ లోని షేక్‌పేట్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కుక్కల దాడిలో ఐదు నెలల చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. గత 17 రోజుల క్రితం (డిసెంబర్ 8) చిన్నారి శరత్‌ను గుడిసెలో పడుకోబెట్టిన తల్లిదండ్రులు పనికి వెళ్లారు. తిరిగి ఇంటికి వచ్చి చూసేసరికి తీవ్ర గాయాలతో చిన్నారి పడి ఉన్నాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు హుటాహుటిన హైదరాబాద్‌లోని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు.15 రోజులుగా ఐసీయూలో చికిత్స పొందుతున్న చిన్నారి మృత్యువుతో పోరాడిన ప్రాణాలు కోల్పోయాడు. షేక్‌పేట్‌లోని వినోభానగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు పరిశీలించగా.. వీధికుక్కలు దాడి చేసినట్లు గుర్తించారు. పసికందు మృతితో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇదిలాఉంటే.. తాజా ఘటనతో జీహెచ్ ఎంసీ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీధికుక్కల బెడదను తొలగించడంలో జీహెచ్ఎంసీ సిబ్బంది విఫలమవుతున్నారని, ఫలితంగా చిన్నారులు కుక్కల దాడిలో తరచూ గాయపడుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గతంలోనూ నగరంలో పలుసార్లు వీధి కుక్కల దాడిలో చిన్నారులు గాయపడి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో అంబర్ పేటలో జరిగిన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఓ నాలుగేళ్ల చిన్నారిపై వీధి కుక్కలు దాడి చేసి చంపేశాయి. అందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డు కాగా.. ఘటనపై హైకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. సుమోటోగా కేసు నమోదు చేసుకొని జీహెచ్‌ఎంసీ అధికారుకు నోటీసులు ఇచ్చింది

Leave A Reply

Your email address will not be published.