అయోధ్య ప్రాణ ప్రతిష్టకు అద్భుత ముహూర్తం

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: దశాబ్దాలుగా కోట్లాది మంది హిందువులు ఎదురు చూస్తున్న గడియలు రానే వస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ఈ క్రమంలోనే వచ్చే నెల 22 వ తేదీన అయోధ్య రామాలయ గర్భగుడిలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. అయితే ఆరోజు మంచి ముహూర్తం ఉన్నట్లు జ్యోతిష్యులు వెల్లడించారు. 84 సెకన్ల పాటు శుభ గడియలు ఉన్నాయని.. ఆ సమయంలో అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరిగితే దేశం పేరు మారు మోగిపోతుందని వెల్లడించారు.జనవరి 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య అత్యంత శుభ గడియలు ఉన్నాయని వారణాసికి చెందిన సంగ్వేద విద్యాలయ ఆచార్యుడు, జ్యోతిషుడు ఆచార్య గణేశ్వర్‌ శాస్త్రి ద్రవిడ్‌ వెల్లడించారు. మేష లగ్నంలో అభిజిత్‌ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్నట్లు తెలిపారు. మధ్యాహ్నం 12.15 గంటల నుంచి 12.45 గంటల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరగనున్నట్లు అయోధ్య ట్రస్ట్ వర్గాలు ఇప్పటికే వెల్లడించాయి.మరోవైపు.. అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఆ నగరంలో ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. ఇక అయోధ్యలోని హోటల్‌ గదుల రేట్లు భారీగా పెరిగి ఆకాశాన్నంటాయి. కొన్నిచోట్ల ఒక్కో గది రేటు రూ.లక్షకు చేరడంతో సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగిలింది. అటు వారణాసిలోనూ ఇదే పరిస్థితి నెలకొందని టూర్‌ ఆపరేటర్లు చెబుతున్నారు. మార్చి వరకు బుకింగ్స్ అయిపోయాయని.. ఆ తర్వాతే కొత్త బుకింగ్స్‌ ప్రారంభం అవుతాయని పేర్కొంటున్నారు. మరోవైపు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆదేశాలతో భద్రతా కారణాల దృష్ట్యా హోటల్‌ బుకింగ్‌లను అధికారులు రద్దు చేస్తున్నారు. అయోధ్యలో ప్రస్తుతం 30 వరకు హోటళ్లు ఉన్నాయి. అందులో రెండు మూడే 4 స్టార్‌ హోటళ్లు ఉండగా… మిగిలినవన్నీ 2, 3 స్టార్ల హోటళ్లే ఉన్నాయని అయోధ్య అధికారులు వెల్లడించారు.ఇక అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాలని మహారాష్ట్రలోని పుణెకు చెందిన కేశవ్‌ శంఖనాద బృందానికి ఆహ్వానం అందింది. ఈ బృందానికి నేతృత్వం వహించే నితిన్‌ మహాజన్‌కు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్‌ రాయ్‌ ఆహ్వాన పత్రికను పంపించారు. ఈ బృందానికి చెందిన 111 మంది అయోధ్యకు వెళ్లి రాముడి విగ్రహప్రతిష్ఠ వేళ అక్కడ శంఖనాదం చేయనున్నారు.ఇక నేపాల్‌ నుంచి కూడా అయోధ్య రాముడికి కానుకలు అందనున్నాయి. నగలు, పట్టు వస్త్రాలు, స్వీట్లతో కూడిన పలు వస్తువులను శ్రీరాముడికి సమర్పించనున్నారు. ఇందుకోసం జనక్‌పుర్‌ధామ్‌ – అయోధ్యధామ్‌ యాత్రను చేపట్టనున్నారు. జనవరి 12 వ తేదీన ఈ యాత్ర ప్రారంభమై జనవరి 20 వ తేదీన కానుకలను శ్రీరామ జన్మభూమి రామ మందిర ట్రస్టుకు అందించడంతో ముగుస్తుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

Leave A Reply

Your email address will not be published.