ఛత్తీస్గఢ్ దంతెవాడ లో ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మృతి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మన్యంలో మరోసారి ఎన్కౌంటర్ జరిగింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం దంతెవాడ జిల్లాలో జరిగిన ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు నక్సలైట్లు మృతి చెందారు. దంతెవాడ జిల్లాలో నక్సలైట్ల కదలికలు ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు, ఆర్మీ జవాన్లు కలిసి సంయుక్తంగా కూంబింగ్ చేపట్టారు. ఈ సందర్భంగా భద్రతాసిబ్బందికి నక్సలైట్లు ఎదురుపడటంతో ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి.దంతెవాడ-సుక్మా జిల్లాల సరిహద్దులోని తుమక్పాల్-దబ్బా కున్నా గ్రామాల మధ్య ఈ ఎన్కౌంటర్ చోటుచేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కాటే కళ్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలోగల దబ్బాకున్నా గ్రామ శివార్లలోని కొండపై ఉన్న నక్సలైట్లను ఆదివారం సాయంత్రం 5.30 గంటలకు భద్రతా సిబ్బంది చుట్టుముట్టడంతో ఎన్కౌంటర్ చోటుచేసుకుందని, బస్తర్ రేంజ్ ఐజీపీ సుందర్రాజ్ చెప్పారు. ఘటనా స్థలంలో భారీగా ఆయుధాలు, మందుగుండు సామాగ్రి లభ్యమైనట్లు తెలిపారు