తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారు
పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి సంచలన ఆరోపణలు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: పులివెందుల టీడీపీ ఇంఛార్జి బీటెక్ రవి సంచలన ఆరోపణలు చేశారు. తనను అంతమొందించేందుకు సీఎం జగన్ కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు. అందుకే తన గన్మెన్లను తొలగించారని చెప్పారు. పులివెందులలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన మాట్లాడారు. తనకున్న ఇద్దరు గన్మెన్లు ఉదయం వెనక్కి వెళ్లిపోయారని తెలిపారు. గన్మెన్ల తొలగింపుపై హైకోర్టును ఆశ్రయిస్తానని చెప్పారు. జగన్ ఎక్కడ పోటీ చేస్తే అక్కడ తనకు టీడీపీ అవకాశం కల్పించాలని కోరారు. తనకు ఏదైనా జరిగితే బాధ్యత జగన్, భారతి, ఎంపీ అవినాష్రెడ్డిదే అని బీటెక్ రవి అన్నారు.మరోవైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎమ్మెల్యే అభ్యర్థులను జగన్ మారుస్తున్నారని.. అది వాళ్ల పార్టీ అంతర్గత విషయమని దాన్ని తామె పట్టించుకోమని బీటెక్ రవి అన్నారు. అయితే ఎమ్మెల్యేలను మార్చే క్రమంలో నిన్ను నువ్వు మార్చుకోవద్దు అని జగన్కు సూచించారు. అలా మార్చుకుని పులివెందులలో లేకుండా పోతే తన పరిస్థితేంటని ఎద్దేవా చేశారు. పులివెందుల ప్రజలకు జగన్ చేసిన అన్యాయం.. పులివెందుల ప్రజల పట్ల చూపించిన నిర్లక్ష్యం, పులివెందుల ప్రజలకు గౌరవం ఇవ్వలేదు కాబట్టి జగన్ను నమ్ముకుని తాను పోటీ చేస్తున్నట్లు బీటెక్ రవి స్పష్టం చేశారు.