ఉచిత ప్రయాణంతో బస్సులలో రద్దీ.. పలు టికెట్ల రద్దు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఉచిత ప్రయాణంతో బస్సుల్లో రద్దీ పెరిగిన నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో జారీ చేసే ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను ఉపసంహరించుకుంది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను రేపటి నుంచి పూర్తిగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.“ఫ్యామిలీ-24, టీ-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాలి. వారి వయసు నమోదు చేయాల్సి ఉంటుంది. మహాలక్ష్మీ స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టీ-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంది. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంది. ప్రయాణికులకు అసౌకర్యం కలిగించవద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింది. రేపటి నుంచి ఈ టికెట్లను జారీ చేయడం లేదు.” అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.