మెట్రో, ఫార్మసిటీని రద్దు చేయడం లేదు

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: మెట్రో, ఫార్మాసిటీని రద్దు చేయడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని స్ట్రీమ్ లైన్ చేస్తున్నామన్నారు. ఎయిర్‌పోర్ట్‌కు గత ప్రభుత్వం ప్రతిపాదించిన రూట్లతో పోలిస్తే దూరం తగ్గిస్తామన్నారు. బీహెచ్‌ఈఎల్‌ నుంచి ఎయిర్‌పోర్ట్‌ వరకు 32 కిలోమీటర్లు వస్తుందన్నారు. ఎంజీబీఎస్‌ నుంచి పాతబస్తీ మీదుగా శంషాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌ వరకు మెట్రో ఉంటుందన్నారు. నాగోల్ నుంచి ఎల్‌బీనగర్‌, ఓఎస్‌ హాస్పిటల్ మీదుగా చాంద్రాయణగుట్టవద్ద మెట్రోలైన్‌కి లింక్‌ చేస్తామన్నారు.మియాపూర్ నుంచి అవసరమైతే రామచంద్రపురం వరకు మెట్రో పొడిగిస్తామని చెప్పారు.

 

జీరో క్లస్టర్లు ఏర్పాటు చేస్తాం..

 

అవసరమైతే మైండ్ స్పేస్ వరకు ఉన్న మెట్రోని ఫైనాన్సియల్ డిస్ట్రిక్ట్ వరకు పొడిగించనున్నట్లు తెలిపారు.గచ్చిబౌలి ఏరియా నుంచి ఎయిర్‌పోర్ట్‌కి మెట్రో వెళ్లేవారు దాదాపు ఉండరని.. తాము కొత్తగా ప్రతిపాదిస్తున్న మెట్రోలైన్స్ ముందు ప్రభుత్వం ప్రతిపాదించిన మొత్తం కంటే తక్కువ అవుతుందన్నారు. ఫార్మాసిటీని అంచెలంచెలుగా రింగ్ రోడ్, రీజినల్ రింగ్ రోడ్ మధ్య ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేస్తామన్నారు. జీరో కాలుష్యంతో ఈ క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్కడే పరిశ్రమల్లో పనిచేసే వారికి గృహనిర్మాణం కూడా ఉంటుందన్నారు. అక్కడి వారు ఎవరూ హైదరాబాద్ వరకు రాకుండా అన్ని ఏర్పాట్లు ఉండేట్లు క్లస్టర్లు ఉంటాయన్నారు. గతంలోని సీఎం క్యాంపు కార్యాలయాన్ని స్టేట్‌ గెస్ట్‌హౌస్‌గా మారుస్తామన్నారు.

 

స్కిల్స్‌ పెంచేందుకు విశ్వవిద్యాలయాలు..

 

యువతకు అవసరమైన స్కిల్స్ పెంచేందుకు ప్రత్యేక విశ్వవిద్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నట్లు చెప్పారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రమాణాలు కలిగిన, ప్రముఖ పేరున్న పారిశ్రామికవేత్తల ద్వారా ఈ స్కిల్స్‌ శిక్షణ ఉంటుందన్నారు. సాధారణ డిగ్రీలకు ఉండే అర్హతలన్నీ ఉంటాయని.. స్కిల్స్ అదనంగా ఉంటాయన్నారు. అక్కడ నుంచి బయటకు వెళ్లేవారికి క్యాంపస్‌లోనే ఎంపిక ఉంటుంనద్నారు.ఇప్పటికే అధికారాన్ని వికేంద్రీకరింమని చెప్పారు. మంత్రులను ఉమ్మడి జిల్లాలకు ఇన్‌చార్జిలుగా బాధ్యతలు చెప్పారు. వంద బెడ్స్ ఆస్పత్రి ఉన్న చోట నర్సింగ్ కళాశాల ఉంటుందన్నారు. విదేశాలకు వెళ్లే యువతకు ఓరియంటేషన్ ఇప్పిస్తామని.. ఆయాదేశాలకు అవసరమైన మ్యాన్‌పవర్‌ను ప్రభుత్వం ద్వారా అందజేస్తామన్నారు. దీంతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామన్నారు. మన వద్ద పెద్ద సంఖ్యలో యువత ఉందని.. ఆసక్తి కలిగిన విభాగాల్లో శిక్షణ ఇప్పిస్తామన్నారు. చాలా మంది సీనియర్ అధికారులు ప్రావిణ్యం కలిగిన వారికి శిక్షణ ఇప్పించే అవకాశం ఉందన్నారు.

 

3న పీసీసీ విస్తృతస్థాయి సమావేశం

 

జనవరి 3న తేదీన పీసీసీ విస్తృతస్థాయి సమావేశం ఉంటుందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పదవులు ఇస్తామన్నారు. పార్టీ కోసం పనిచేసిన వారితో నామినేటెడ్ పదవులు భర్తీ చేస్తామని తెలిపారు. తనకు దగ్గరి వ్యక్తులకు, బంధువులకు పదవులు ఇచ్చేది లేదన్నారు. ఏది చేసినా విస్తృతస్థాయి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని పదవులు భర్తీ చేస్తామని చెప్పారు. పార్టీ కోసం పని చేసిన వారికి పదవులు ఇస్తామన్నారు. ప్రెస్ అకాడమీ చైర్మన్ భర్తీ చేసిన తర్వాత జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

 

సామాజిక న్యాయం జరిగేలా చూస్తాం..

 

హైదరాబాద్ కమిషనరేట్ల కమిషనర్లను నియమించినట్లు చెప్పారు. వారికి అవసరమైన మ్యాన్‌పవర్‌ను వాళ్లే ఎంచుకుంటారన్నారు. శాఖలకు ప్రతిభ కలిగిన అధిపతులను నియమించడం వరకు తానే చూస్తానన్నారు. వాళ్ల పరిధిలో అవసరమైన అధికారులను నియమించుకొని యంత్రాంగం సక్రమంగా పనిచేసేలా చూసుకోవాలన్నారు. అధికారుల నియామకాల్లో సామాజిక న్యాయం జరిగేట్లు చూస్తామన్నారు. సంస్కరణలు తీసుకొచ్చి స్ట్రీమ్ లైన్ చేసే పనిలో ఉన్నానన్నారు. తన వద్ద చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి ఉండదన్నారు. జర్నలిస్టులకు సంబంధించిన సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరిస్తామని.. ఇప్పటి నుంచి వందరోజుల్లో పరిష్కరిస్తామన్నారు.

Leave A Reply

Your email address will not be published.