బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను పరామర్శించిన ఏపీ సీఎం జగన్..
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. గురువారం తాడేపల్లి నుంచి హైదరాబాద్కు వచ్చిన సీఎం జగన్.. బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు.కేసీఆర్ ఇటీవలే తన ఫామ్హౌస్లో జారిపడటంతో తుంటి ఎముక విరిగిన విషయం తెలిసిందే. సోమాజీగూడ యశోద ఆసుపత్రిలో కేసీఆర్కు వైద్యులు హిప్ రీప్లేస్మెంట్ సర్జరీని విజయవంతంగా నిర్వహించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం కేసీఆర్ గాయం నుంచి కోలుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్.. కేసీఆర్ను పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశారు.