సంక్రాంతి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్ళు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: సంక్రాంతి పండుగ నేపథ్యంలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా దక్షిణ మధ్య రైల్వే మరో నాలుగు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్ -కాకినాడ టౌన్, హైదరాబాద్ డెక్కన్ – కాకినాడ టౌన్ మధ్య నాలుగు రైళ్లను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు పేర్కొంది. ఆయా రైళ్లను ప్రయాణికులు వినియోగించుకోవాలని కోరింది. ఆయా రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్ క్లాస్, జనరల్ క్లాస్ కోచ్లు ఉంటాయని పేర్కొంది. సికింద్రాబాద్ – కాకినాడ టౌన్ (07021) రైలు.. ఈ నెల 11న రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు కాకినాడకు చేరుతుంది.కాకినాడ టౌన్ – సికింద్రాబాద్ (07022) రైలు 12న అందుబాటులో ఉండనున్నది. కాకినాడలో సాయంత్రం 5.40 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు ఉదయం 5.55 గంటలకు సికింద్రాబాద్కు చేరుతుంది. హైదరాబాద్ – కాకినాడ టౌన్ (07023) రైలు 12న నడువనుండగా.. నాంపల్లిలో సాయంత్రం 6.30గంటలకు బయలుదేరి మరుసటిరోజు ఉదయం 7.10గంటలకు కాకినాడకు చేరుకుంటుంది. కాకినాడటౌన్ – హైదరాబాద్ (07024) రైలు 13న పరుగులు తీయనున్నది. రైలు రాత్రి 10గంటలకు కాకినాడ నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30గంటలకు నాంపల్లి రైల్వేస్టేషన్కు చేరుకుంటుందని పేర్కొంది.సికింద్రాబాద్ కాకినాడ టౌన్ రైళ్లు జనగామ, కాజీపేట్, వరంగల్, మహబూబాబాద్, డోర్నకల్, ఖమ్మం, రాయనపాడు, గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట జంక్షన్ రైల్వేస్టేషన్లలో ఆగుతాయని చెప్పింది. ఇక హైదరాబాద్ – కాకినాడ టౌన్ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్ జంక్షన్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, అనపర్తి, సామర్లకోట జంక్షన్లలో ఆగుతాయని వివరించింది.