పట్టా పుస్తకాల్లో జగన్ ఫొటో పెట్టడంపై పవన్ కల్యాణ్ ఫైర్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: జనసేన కేంద్ర కార్యాలయంలో న్యాయవాదులతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. వైసీపీ ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం ఏపీ ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ పై పవన్ కళ్యాణ్ కు న్యాయవాదులు వివరించారు.”వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వారసత్వంగా వచ్చే పట్టా పుస్తకాల్లో జగన్ ఫొటో ఏమిటో అర్దం కాలేదు. వారసత్వంగా వచ్చిన భూమిలో జగన్ ముఖచిత్రంతో రాయి ఏమిటి. నేను ఇచ్చేవాడిని.. మీరు తీసుకునేవాడిని.. అందరూ లోబడి ఉండాలనే మైండ్ సెట్ జగన్ ది. రాజ్యాంగ బద్దంగా ఆలోచన చేసే వారు ఎవరూ ఇలాంటి పనులు చేయరు. భూహక్కు చట్టాన్ని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు. ముందుగానే అందులోని అంశాలను అమలు చేసేస్తున్నారు. ఎవరి ఆస్తులు అయినా.. వారి కబంధ హస్తాల్లో పెట్టుకునేలా చట్టం చేశారు. నేను ఈ విషయం విన్నప్పుడు న్యాయవాదులు తమ కేసులు పోతాయనే ఆందోళనలు చేస్తున్నారని ప్రచారం చేశారు. గతంలో ఇసుక సమస్య సమయంలో కూడా కార్మికుల పొట్ట కొట్టి వారిపైనే దుష్ప్రచారం చేశారు. లీగల్ జీనియస్ నాని పాల్కీ వాలాకు నేను ఏకలవ్య శిష్యుడిని. న్యాయవ్యవస్థను అతిక్రమించి రెవిన్యూకు హక్కును ఎలా కట్టబెడతారు. ఆస్తులను దోచేయడం సులభతరం అవుతుందనే ఈ చట్టం తెచ్చారు. ” అని పవన్ కల్యాణ్ విమర్శించారు.

“రిషికొండను దోచుకున్నట్లు.. ప్రైవేటు వ్యక్తుల ఆస్తులను కూడా దోచుకునే కుట్రకు తెర లేపారు. సామాన్యుల నుంచి గృహిణిలకు కూడా అర్దం అయ్యే విధంగా ఈ అంశాలన్ని తీసుకెళ్లాలి. మరింత లోతుగా అందరికీ చెప్పడానికి రెండు రోజుల సమయం తీసుకుని పూర్తిగా పరిశీలిస్తాను. ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్డు అనేది డ్రెకోనియన్ లా. న్యాయవాదులకు అర్దమైన విధంగా ప్రజలకు కూడా మనం చెప్పాల్సన అవసరం ఉంది. లీగల్ అవగాహన లేని వ్యక్తులకు సామాన్య పరిభాషలో అర్దం అయ్యేలా చెబుతాను. ఐదుగురు వ్యక్తులు కమిటీగా ఏర్పడితే ఈ చట్టం వల్ల కలిగే నష్టాలపై చర్చిస్తాను. ఆ తర్వాత పెద్ద సమావేశం పెట్టి అందరికీ వివరించేలా ముందుకు వెళదాం. ఇది కచ్చితంగా రాజ్యాంగ విరుద్దమైన చట్టం, ప్రాధమిక హక్కులను ఉల్లంఘించే చట్టం. మరోసారి అందరం కలిసి చర్చించుకుని.. కార్యాచరణ సిద్దం చేద్దాం. జనసేన పక్షాన న్యాయవాదుల ఆందోళనకు మద్దతు ఇస్తాను. ఈ చట్టాన్ని అమలు కాకుండా చూసే బాధ్యత నేను తీసుకుంటాను. దేశంలో ఉన్న ప్రతిపౌరుడు రాజ్యాంగ విరుద్దమైన చట్టాన్ని అడ్డుకోవాలి. రాజకీయాలకు అతీతంగా.. ఏపీ ప్రజలకు హాని కలిగించే చట్టాన్ని బలంగా వివరించాలి. త్వరలో పెద్ద సభలా పెట్టి.. ప్రజల్లోకి వైసీపీ దుర్మార్గాన్ని తీసుకెళ్లాలి. న్యాయవాదుల దీక్ష శిబిరాలకు కూడా వచ్చినా వంతుగా మద్దతు ఇస్తాను.” అని పవన్ కల్యాణ్ అన్నారు.

Leave A Reply

Your email address will not be published.