సరైన భరోసా ఉంటే ఆత్మహత్యలు ఉండవు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఆత్మహత్య చేసుకోవాలని అనుకునే వ్యక్తికి ఆఖరి నిమిషంలో భరోసా లభించినా తన సూసైడ్ ప్రయత్నాన్ని విరమించుకునే అవకాశం ఉంటుందని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు. నేటి సమాజంలో నానాటికి క్షీణించిపోతున్న నైతిక విలువలు, పెరుగుతున్న మానసిక సంఘర్షణ… పలు రకాల సమస్యలు మనిషిని ఆత్మహత్యకు ప్రేరేపిస్తాయని డాక్టర్ లిల్లీ మేరి అన్నారు. సమాజంలో మానవతా విలువలు నశించి పోవటం, ఎదుటి మనిషిని అకారణంగా దూషించడం, నిందించడం, తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఎదుటివారిని బలి చేయడం వంటివి కూడా బలవన్మరణానికి దారి తీస్తాయని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి తెలిపారు. కొందరు సున్నిత మనస్కులు సమస్య చిన్నది అయినా భూతద్దంలో చూసి తమలో తాము కుమిలిపోతూ బలవన్మరణానికి పాల్పడుతున్నారు. ఆత్మహత్య చేసుకునే వారిలో సినీ, రాజకీయ ప్రముఖుల కూడా ఉన్నారు. ఉద్యోగం దొరకలేదని కొంతమంది, పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేదని మరి కొంతమంది, తమ కోరుకున్న ప్రియుడు లేదా ప్రియురాలు తనకు దక్కలేదని కొంతమంది బలవన్మరణాల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారని డాక్టర్ లిల్లీ మేరి అన్నారు. సమస్య ఏదైనా వారికి బలవన్మరణమే శరణ్యమవుతుంది. అందుకే అలాంటి వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.సినీ,టీవీ ప్రభావాలతో విలాసవంతమైన జీవన కోరికలు వెరసి ఆధునిక యువత హైటెక్ వేగంతో పరుగులు తీస్తుంది. ముఖ్యంగా యువతలో ఆకర్షణ కారణంగా ప్రేమ పెళ్లిళ్లు చేసుకోవడానికి ఉవిల్లూరుతున్నారు. ప్రేమ ఫలిస్తే ఓకే… లేదంటే వన్ సైడ్ ప్రేమ వల్ల యువత మనసు చెదిరి కిడ్నాప్, యాసిడ్ దాడులు, అఘాయిత్యాలు, అత్యాచారాలు, లేదంటే చంపడమో, తామే చావడమో జరుగుతుంది. మరోవైపు వివాహేతర సంబంధాలతో ఎందరో బలవుతున్నారు. ఇదంతా ఆ క్షణములో తాము తప్పు విషయాన్ని విస్మరించడమే. ఇదే ప్రధాన కారణం అని సహాయ ఆచార్యులు లిల్లీ మేరి పేర్కొన్నారు. నైతిక విలువలు లోపించడం వల్ల ఏమి చేస్తున్నామో తెలియకే ఇలాంటి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొందరు తప్పులు చేయడం, తర్వాత దొరికిపోతామనే భయంతో బలవన్మరణాల వైపు మొగ్గుచూపుతున్నారు. విద్యార్థుల విషయంలో పరీక్షలలో ఉత్తీర్ణత సాధించకపోతే ఏమాత్రం ఆలోచించకుండా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దీనికి విద్యార్థుల తల్లిదండ్రులు, స్కూళ్లలో ఉపాధ్యాయులు వారికి జీవితముపై సరైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తమ స్నేహితులతో అన్ని విషయాలు షేర్ చేసుకోవడం వల్ల కూడా కొంతవరకు కొన్ని సమస్యలకు ఉపశమనం కలుగుతుంది. ఫెయిల్ అయిన విద్యార్థుల పట్ల చులకన భావం వదిలి… వారికి నచ్చ చెప్పడం, ఓదార్చడం వంటివి చేయాలి. చదివినా చదువుకు సరైన ఉద్యోగాలు రాక కృంగిపోయే వారికి సైతం సర్ది చెప్పిమరో ఛాన్స్ కోసం ప్రయత్నం చేయమని సలహా ఇవ్వాలి. మానసిక సంఘర్షణలతో ఎక్కువ సేపు గడపకుండా, కాస్త ఆటవిడుపు అనేది ఉండాలి. అప్పుడే ఎలాంటి ఒత్తిడినైనా జయించగలుగుతారని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.ఇటీవల కొన్ని జరిగిన సంఘటన చూస్తే పంటలు సరిగా పండలేదని, తన సమస్యకు పరిష్కారం చావేనని అనుకుని రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలా ఒక్కరేంటి ప్రతిరంగంలోనూ పని చేసే వాళ్ళు అధిక ఒత్తిడిని ఎదుర్కోలేక, ఆ క్షణంలో ఆత్మన్యూనతా భావముతో బలవన్మరణాల సంఖ్య పెరుగుతుంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగామిలియన్ మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 40 సెకండ్లకు ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. మనిషి ఒత్తిడిలో ఉన్న సమయంలో భరోసా అవసరం. అలాంటి పరిస్థితుల్లో కొంచెం ఉపశమనం కలిగించే మాటలు వింటే చాలు ఆత్మహత్య చేసుకోవాలని వారు ఇట్టే విరమిస్తారని సిద్దిపేట ప్రభుత్వ నర్సింగ్ కళాశాల సహాయ ఆచార్యులు డాక్టర్ లిల్లీ మేరి అన్నారు.