ఒకే కుటుంబంలో ఐదుగురి మృతి
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉత్తర్ప్రదేశ్ రాష్ట్రంలోని అమ్రోహా గ్రామంలో ఒకే కుటుంబంలోని ఐదుగురు వ్యక్తులు మృతి చెందారు. మరో ఇద్దరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బొగ్గు వల్ల వెలువడిన పొగతో ఊపిరాడక ఐదుగురు మృతి చెందినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన ఇద్దరు అమ్రోహాలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం నాడు రాత్రి బాధితులు నిద్రిస్తున్న సమయంలో ఈ ఘటన జరిగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సోమవారం నాడు రాత్రి నుండి ఈ ఇంట్లో ఉండే ఏడుగురిలో ఎవరూ కూడ బయటకు రాలేదు. దీంతో మంగళవారం నాడు సాయంత్రం గ్రామస్తులు తలుపులు పగులగొట్టారు. అయితే అప్పటికే ఏడుగురు అపస్మారక స్థితిలో పడి ఉన్నారని పోలీసులు చెప్పారు. వెంటనే స్థానికులు ఏడుగురిని ఆసుపత్రికి తరలించారు. అయితే సోనమ్, వారిస్, మెహకర్ జైద్, మహిర్ లు మరణించినట్టుగా వైద్యులు ప్రకటించారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గదిలో పొగ కారణంగా ఊపిరాడక మృతి చెందినట్టుగా వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ఐదుగురి మృతికి గల కారణాలపై విచారణ జరుపుతామని పోలీసులు ప్రకటించారు. గత ఏడాది సెప్టెంబర్ మాసంలో కర్ణాటకలోని దొడ్డబళ్లాపురంలో కూడ ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. గది వేడిగా ఉండేందుకు బొగ్గులతో మంటను ఏర్పాటు చేశారు.దీంతో వచ్చిన పొగతో ఊపిరాడక నలుగురు సభ్యులు నిద్రలోనే మృతి చెందారు. మూసిఉన్న గదిలో బొగ్గును కాల్చడం వల్ల శ్వాస తీసుకోవడంలో సమస్యలు ఏర్పడుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.