చోరీలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన పోలీసులు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఈ మధ్యకాలంలో చోరీలకు పాల్పడుతున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. తార్నాక లాలాపేట్కు చెందిన నీలం రామారావు (68) చర్లపల్లిలోని ఓ పరిశ్రమలో ఉద్యోగి.గత నెల 30న మధ్యాహ్నం బైక్పై ఇంటికి బయలుదేరిన ఆయన్ను చర్లపల్లి సెంట్రల్ జైలు సమీపంలో ఇద్దరు వ్యక్తులు అడ్డగించారు. తాము పోలీసులమని చెప్పి తనిఖీ చేశారు. రామారావు నుంచి పర్సు, ఉంగరాన్ని తీసుకున్నారు. వెంటనే ఉంగరాన్ని కావాలని కింద పడేసి తీసుకోమని చెప్పారు. కిందపడిన ఉంగరాన్ని వృద్దుడు తీసుకుంటుండగా.. అతడి దృష్టి మరల్చి పర్సులోని రూ. 5 వేల నగదు కాజేశారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిన బాధితుడు పర్సు చూసుకోగా.. డబ్బులు కనిపించలేదు. దీంతో వెంటనే చర్లపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.సీసీ ఫుటేజీల ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. మేడిపల్లికి చెందిన కాశీ విశ్వనాథ్ (45), వికారాబాద్కు చెందిన దేవిదాస్ నాయక్ (40)ను నిందితులుగా గుర్తించారు. చర్లపల్లి ప్రాంతంలో తిరుగుతున్న ఇద్దరిని బుధవారం (జూన్ 5) అరెస్ట్ చేశారు. విశ్వనాథ్ పాత నేరస్థుడని, పలు పోలీసు స్టేషన్లలో అతడిపై ఆరు కేసులు నమోదైనట్లు పోలీసులు వెల్లడించారు.