ఉత్తరాఖండ్ లో ఘోర ప్రమాదం
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉత్తరాఖండ్లోని బద్రీనాథ్ హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అలకనంద నదిలో ఒక టెంపో వాహనం పడిపోయింది. ఈ టెంపోలో 25 మందికి పైగా ప్రయాణికులు ఉన్నారని, వారిలో 10 మంది వరకూ మృతి చెంది ఉంటారని సమాచారం. రుద్రప్రయాగ్కు ఐదు కిలోమీటర్ల దూరంలో హైవేపై రతౌలీ గ్రామ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. గ్రామస్తులు పోలీసులు, పరిపాలనా అధికారులు, డీడీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి. టెంపో నుంచి క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చి, హెలికాప్టర్ ద్వారా గుప్తకాశీలోని ఆస్పత్రికి తరలించారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ ధామి ప్రమాదం గురించి తెలిసిన వెంటనే పోలీసులు, పరిపాలనా అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనపై ఆయన ఒక ట్వీట్లో విచారం వ్యక్తం చేశారు. క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంపై విచారణకు పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని నిర్థారణ చేశారు.