ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలి

- విద్యాశాఖామంత్రి నారా లోకేశ్

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రి నారా లోకేశ్ అన్నారు. అలాగే, ఈ యేడాది లోగా పాఠశాలల్లో పూర్తిస్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు. ఆయన శనివారం ఉండవల్లిలోని తన నివాసంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన ఫేజ్-2, ఫేజ్-3 పనులన్నీ యేడాదిలోగా పూర్తిచేయాలని ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం నాణ్యత విషయంపై అధికారులను ఆరా తీశారు. పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లో స్కూల్స్ శానిటేషన్‌ను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు.

గత ఐదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకుగల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. జనరల్ డ్రాప్ ఔట్స్ వివరాలు కూడా అందజేయాలన్నారు. ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు గల కారణాలను కూడా తెలియజేయాలన్నారు. దేశంలోనే బెస్ట్ లైబ్రరీ మోడల్ ఎక్కడ ఉందో తెలుసుకుని, సమీక్ష చేసి అందుకు సంబంధించిన నోట్‌ను సిద్ధం చేయాలని తెలిపారు. బైజూస్ కంటెంట్, ఐఎఫ్‌బీ వినియోగం మీద సమగ్ర నోట్‌ ఇవ్వాలని సూచించారు.

Leave A Reply

Your email address will not be published.