తండ్రిని హత మార్చిన కుమార్తె

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: తనకు నచ్చని యువకుడితో వివాహం చేసేందుకు మొండిపట్టుబట్టిన తండ్రిన ఓ కుమార్తె హత్య చేసింది. ఈ దారుణ ఘటన ఏపీలోని అన్నమయ్య జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, మదనపల్లె జీఆర్టీ స్కూల్‌లో దొరస్వామి అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. పెళ్లీడుకొచ్చిన కుమార్తెను ఓ ఇంటిదాన్ని చేసేందుకు ఆయన సంబంధాలు చూడటం ప్రారంభించాడు. ఈ క్రమంలో ఓ సంబంధాన్ని ఖరారు చేసుకునేందుకు ప్రయత్నించాడు.

అయితే, ఆ సంబంధం తనకు నచ్చలేదని, అందువల్ల ఆ సంబంధం ఖరారు చేయొద్దంటూ కోరింది. అయినప్పటికీ ఉపాధ్యాయుడు దొరస్వామి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కుమార్తె.. చపాతీలు తయారు చేసే కర్రతోనూ, ఇనుపరాడ్డుతోనూ తండ్రిపై దాడిచేసింది. దీంతో తీవ్రంగా గాయాలపాలైన తండ్రి దొరస్వామి అక్కడే మృతి చెందాడు. ఈ హత్య కేసు సమాచారం తెలుసుకున్న స్థానిక పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అలాగే, కుమార్తెను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Leave A Reply

Your email address will not be published.