ఉత్తరాఖండ్ లో తగలబడుతున్న అడవులు
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఉత్తరాఖండ్లో అడవుల్లో మంటలు అదుపు తప్పుతున్నాయి. నవంబరు నుంచి దాదాపు వెయ్యికి పైగా అగ్ని ప్రమాద ఘటనల్లో పచ్చదనంతో నిండిన సుమారు 1500హెక్టార్ల అటవీ భూమి కాలిపోయి ధ్వంసమైంది. బిన్సార్తో సహా వివిధ ఘటనల్లో ఇప్పటివరకు 10 మంది ప్రాణాలు కోల్పోగా, తొమ్మిది మంది గాయపడ్డారు. మంటలను అదుపు చేసేందుకు అధికారులు ఎప్పటికప్పుడు వైమానిక దళం హెలికాప్టర్ల సాయం తీసుకుంటున్నప్పటికీ మంటలను పూర్తిగా అదుపు చేయలేకపోయారు.
నవంబర్ 2023 నుండి రాష్ట్రంలో 1,242 అటవీ అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇందులో 1,696 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ సంపద దెబ్బతిన్నది. అడవి మంటలను అదుపు చేసేందుకు ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ ఏప్రిల్లో నైనిటాల్ జిల్లాకు చేరుకుంది. అదేవిధంగా మేలో కూడా ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ గర్వాల్కు చేరుకుంది. రాష్ట్రంలో కుమావోన్ డివిజన్లో గరిష్టంగా 598, గర్వాల్ డివిజన్లో 532 వద్ద అటవీ మంటలు సంభవించాయి.
వేడి పెరగడంతో అల్మోరా, రాణిఖేత్లలో మంటలు మళ్లీ అంటుకోవడం ప్రారంభమయ్యాయి. సాల్ట్ డెవలప్మెంట్ బ్లాక్లోని ఐటీఐ, విశ్వనాథ్, కతర్మాల్, దోటియాల్ సమీపంలోని అడవుల్లో ఇప్పుడు మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది గంటపాటు శ్రమించి మంటలను అదుపు చేశారు. సాల్ట్ డెవలప్మెంట్ బ్లాక్లోని విశ్వనాథ్, కతర్మాల్, దోటియాల్ సమీపంలోని అడవులలో శనివారం కూడా భారీ అగ్నిప్రమాదం జరిగింది. రోజంతా అడవి మండుతూనే ఉంది. కానీ పాలకసిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకోలేదు. రోజంతా అడవులు మండుతూనే ఉన్నాయి. రాణిఖేత్లోని సౌనీ, రిచీ అడవులు కూడా మండుతూనే ఉన్నాయి