క్యాన్సర్ తో బాధపడుతూ భార్య మృతి .. భర్త ఆత్మహత్య

తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: కేన్సర్‌తో పోరాడుతూ భార్య చనిపోయిన కొద్ది నిమిషాలకే.. అసోం హోం శాఖ కార్యదర్శి, ఐపీఎస్ శీలాదిత్య చేతియా ఓ ప్రయివేట్ హాస్పిటల్ ఐసీయూలో సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నారు. కొద్ది కాలం క్రితమే తల్లి, అత్త మరణించడం.. ఆ విషాదాల నుంచి తేరుకోక ముందే భార్య కూడా కేన్సర్‌తో కన్నుమూయడంతో శీలాదిత్య తనను తాను కాల్చుకొని ప్రాణాలు వదిలారు.చేతియా భార్య అగమోని బొర్బారుహా (40) చాలా కాలంపాటు కేన్సర్‌తో బాధపడ్డారు. గువహటిలోని ఓ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆమె మంగళవారం సాయంత్రం 4 గంటల 25 నిమిషాలకు తుదిశ్వాస విడిచారు. డాక్టర్లు తన భార్య మరణ వార్త చెప్పగానే.. ఐసీయూలో ఆమె ఉన్న గదిలోకి వెళ్లిన ఐపీఎస్ అధికారి శీలాదిత్య.. పది నిమిషాలు గడిచాక తన భార్య మృతదేహం వద్ద ప్రార్థన చేసుకోవడం కోసం.. తనను ఒంటరిగా వదిలేయాలని హాస్పిటల్ సిబ్బందిని కోరారు.ఐసీయూ నుంచి సిబ్బంది బయటకు వెళ్లిన కాసేపటికే తుపాకీ కాల్పుల శబ్దం వినిపించింది. దీంతో వారు పరిగెత్తుకుంటూ వెళ్లి చూడగా.. భార్య డెడ్ బాడీ పక్కనే శీలాదిత్య అచేతనంగా పడి ఉన్నారు. ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ సాధ్యం కాలేదని డాక్టర్లు తెలిపారు. ‘అగమోనికి రెండు నెలలపాటు మా హాస్పిటల్‌లోనే చికిత్స అందించాం.. మూడు రోజుల క్రితం ఆమె ఆరోగ్యం క్షీణించింది.. దీంతో ఆమె పరిస్థితి గురించి శీలాదిత్యకు వివరించాం.. ఆయన్ను అర్థం చేసుకున్నారు’ అని నెమ్‌కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ హితేశ్ బారువా తెలిపారు.2009 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన శీలాదిత్య.. 2013లో అగమోనిని పెళ్లాడారు. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. ఈ దంపతులకు సంతానం లేదు. భార్య మరణాన్ని తట్టుకోలేక ఆత్మహత్యకు పాల్పడిన శీలాదిత్య ఇటీవలి కాలంలో వరుస విషాదాలను చవి చూశారని అసోం మాజీ డీజీపీ, ప్రస్తుత చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్ అయిన భాస్కర జ్యోతి మహంత తెలిపారు.‘శీలాదిత్య నాకు తమ్ముడి లాంటివాడు. అతడి జీవితం మొత్తం కష్టాలే. కొద్ది కాలం క్రితమే అతడు తల్లిని, అత్తగారిని కోల్పోయాడు. కేన్సర్‌తో బాధపడుతోన్న భార్య బాగోగులు చూసుకున్నాడు. చికిత్స కోసం ఆమెను చెన్నైకి కూడా తీసుకెళ్లాడు. అతడితో నేను తరచుగా మాట్లాడుతూనే ఉన్నాను. ఆత్మహత్య దిశగా అతడు ఎలాంటి సంకేతాలు ఇవ్వలేదు’ అని భాస్కర జ్యోతి మహంత తెలిపారు. శీలాదిత్య ఆత్మహత్య చేసుకున్నారనే విషయం తెలియగానే ఆయన హాస్పిటల్‌కు వెళ్లారు.శీలాదిత్య ఎంతో ధైర్యవంతుడైన పోలీసు అధికారిగా గుర్తింపు పొందారు. 2015లో ఆయన రాష్ట్రపతి చేతుల మీదుగా పోలీస్ మెడల్‌ను సైతం అందుకున్నారు. శీలాదిత్య మరణించిన విషయాన్ని అసోం డీజీపీ జీపీ సింగ్ ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు. ఆయన మరణం అసోం పోలీసు విభాగం మొత్తాన్ని కలచివేసిందన్నారు.చేతియా తండ్రి కూడా గతంలో పోలీస్ అధికారిగా పని చేశారు. తిన్సుకియా, నల్బరీ, కోక్రాఝార్, బార్‌పేట జిల్లాలకు ఎస్పీగా శీలాదిత్య వ్యవహరించారు. క్రిమినల్స్, ఉగ్రవాదుల ఆటకట్టించడం కోసం ఆయన అనేక సాహసోపేతమైన ఆపరేషన్లు నిర్వహించారు.

Leave A Reply

Your email address will not be published.