ఏపీలో మరో ఐదు రోజులపాటు వర్షాలు కురిసే ఛాన్స్
తెలంగాణ జ్యోతి వెబ్ న్యూస్: ఏపీలో మరో ఐదురోజులపాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. ఉపరితల ఆవర్తనం, ద్రోణి ఎఫెక్టుతో తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. కొన్నిచోట్ల భారీ వర్షాలు కురిస్తే, మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐఎండీ ఏపీ ప్రజలకు మరో చల్లటి కబురును అందించింది. రానున్న ఐదురోజులపాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాలు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. నేడు కోస్తాలోని పార్వతీపురం, అల్లూరి, విశాఖపట్నం జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇదిలా ఉండగా, నిన్నరాత్రి నుంచి విజయవాడలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోన్న సంగతి తెలిసింది. ఇక, తెలంగాణలోనూ పలు జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. హైదరాబాద్ నగరంలో కూడా అక్కడక్కడ వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీలో మరో ఐదురోజుల పాటు వర్షాలు పడనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో రెండు రోజులపాటు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ద్రోణి ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో రాబోయే 5 రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.