హైదరాబాద్ రోడ్లపై త్వరలో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

తెలంగాణ జాతి /వెబ్ న్యూస్: హైదరాబాద్‌లోని ఆర్‌టీసీ ప్రయాణికులకు శుభవార్త. త్వరలో ఐకానిక్ డబుల్ డెక్కర్ బస్సులు హైదరాబాద్ రోడ్లపై చక్కర్లు కొట్టనున్నాయి. ఈసారి ఎలక్ట్రిక్ రూపంలో డబుల్ డెక్కర్ బస్సులు ప్రయాణికులకు సేవలు అందించనున్నాయి. హైదరాబాద్ అంటే చార్మినార్, గోల్కొండ, హుస్సేన్ సాగర్ మాత్రమే కాదు… డబుల్ డెక్కర్ బస్సులు కూడా గుర్తొస్తాయి. 1990వ దశకంలో పుట్టినవారు డబుల్ డెక్కర్ బస్సుల్లో తిరిగిన జ్ఞాపకాలను ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. మళ్లీ హైదరాబాద్ రోడ్లపైకి డబుల్ డెక్కర్ బస్సుల్ని తీసుకురావాలన్న డిమాండ్ చాలాకాలంగా ఉంది.  సిటీలో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పాలంటూ మంత్రి కేటీఆర్‌ను ట్విట్టర్‌లో నెటిజన్లు రిక్వెస్ట్ చేస్తూనే ఉంటారు. హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పుతామని కేటీఆర్ హామీ కూడా ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రణాళికలు ప్రారంభించాలని తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ను కోరారు.  హైదరాబాద్‌లో మళ్లీ డబుల్ డెక్కర్ బస్సుల్ని తిప్పేందుకు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా కార్పొరేషన్ (TSRTC) చర్యలు ప్రారంభించింది. హైదరాబాద్‌లో ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని నడపనుంది. అద్దెకు తీసుకొని వీటిని నడిపేందుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. సిటీలో మూడు వేర్వేరు రూట్లలో 10 ఇ-డబుల్ డెక్కర్ బస్సుల్ని అద్దెకు తీసుకొని నడపనుంది. ఇందుకు సంబంధించిన టెండర్‌ను మరో వారంలో ఆహ్వానించనుంది టీఎస్‌ఆర్‌టీసీ. అద్దె ప్రాతిపదికన ఈ బస్సులను నడపడానికి ఆసక్తి ఉన్న కంపెనీలు తమ బిడ్‌లను నమోదు చేసుకోవాలని టీఎస్‌ఆర్‌టీసీ ఆహ్వానించనుంది. బిడ్ గెలుచుకున్న కంపెనీ ఈ బస్సులను అద్దె ప్రాతిపదికన ఇచ్చేందుకు టీఎస్‌ఆర్‌టీసీతో ఒప్పందం చేసుకుంటుంది. ఆ కంపెనీకి టీఎస్‌ఆర్‌టీసీ అద్దెను ఫిక్స్‌డ్‌గా చెల్లిస్తుంది. ఛార్జీలు, రూట్లు లాంటి నిర్ణయాలన్నీ టీఎస్‌ఆర్‌టీసీ తీసుకుంటుంది. ప్రస్తుతం నష్టాల్లో ఉన్న ఆర్టీసీ ప్రయాణికుల రద్దీని పెంచి లాభాల వైపు పరుగులు తీసుకేందుకు టీఎస్‌ఆర్‌టీసీ అనేక చర్యల్ని తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పెద్దమొత్తంలో డబ్బు ఖర్చుపెట్టి బస్సుల్ని కొనకుండా అద్దెకు తీసుకొని నడపడం ద్వారా భారాన్ని తగ్గించుకుంటుంది. ఇక ఇ-డబుల్ డెక్కర్ బస్సుల్ని ఏ రూట్‌లో నడపాలన్నదానిపై ఇప్పటికే ఆర్‌టీసీ అధికారులు అధ్యయనం జరిపారు. హైదరాబాద్‌లో పలు చోట్ల ఫ్లైఓవర్లు ఉన్న సంగతి తెలిసిందే. ఫ్లైఓవర్లతో ఇబ్బంది లేని రూట్‌లోనే ఇ-డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశం ఉంది. ప్రస్తుతానికి మూడు రూట్‌లు ఫైనలైజ్ చేశారని వార్తలొస్తున్నాయి. పటాన్‌చెరు-కోటి, జీడిమెట్ల-సీబీఎస్, అఫ్జల్‌గంజ్-మెహదీపట్నం రూట్‌లో ఇ-డబుల్ డెక్కర్ బస్సులు తిరిగే అవకాశాలున్నాయి. ఇక ముంబైలో ఇప్పటికే ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి. స్విచ్ మొబిలిటీ మోడల్ బస్సుల్ని ముంబైలో ప్రజా రవాణా కోసం తిప్పుతున్నాయి. ఈ ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సుల్ని ఇండియాలోనే డిజైన్ చేసి తయారు చేయడం విశేషం. బృహణ్ ముంబై ఎలక్ట్రిక్ సప్లై అండ్ ట్రాన్స్‌పోర్ట్ ఆధ్వర్యంలో ఈ బస్సులు నడుస్తున్నాయి.

Leave A Reply

Your email address will not be published.