మరో సారి నీటమునిగిన బెంగళూరు పట్టణం
.. నగరంలోని రోడ్లన్నీ జలమయం .. అపార్ట్మెంట్ సెల్లార్లలోకి చేరిన నీరు. ..నీటమునిగిన లోతట్టు ప్రాంతాలు మూడురోజులపాటు మహానగరంలో భారీ వర్షాలు
తెలంగాణ జ్యోతి / వెబ్ న్యూస్: కర్ణాటక రాజధాని బెంగళూరును మరోసారి భారీ వాన ముంచెత్తింది. దీంతో నగరంలోని రోడ్లన్నీ జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. అపార్ట్మెంట్ సెల్లార్లలోకి నీరుచేరడంతో వాహనాలు చెడిపోయాయి. ఐటీ క్యాపిటల్లో బుధవారం సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభమైన వాన కుండపోతగా కురిసింది.
దీంతో ఆఫీసులు ముగించుకుని ఇంటికి వెళ్తున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రాజమహల్ గుట్టహళ్లి ప్రాంతంలో 59 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. కాగా, మరో మూడురోజులపాటు మహానగరంలో భారీ వర్షాలు కరుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. ఎల్లో హెచ్చరిక జారీ చేసింది.గత నెల మొదటివారంలో బెంగళూరులో ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతో సిలికాన్ సిటీ జలమయంగా మారింది. భారీవర్షానికి నగరంలోని అన్నిప్రాంతాల్లో వరద పోటెత్తింది. రోడ్లన్నీ స్విమ్మింగ్పూల్స్ను తలపించాయి. వరదల ధాటికి రెండురోజులపాటు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సాఫ్ట్వేర్ కంపెనీలు కొలువైఉన్న వైట్ ఫీల్డ్, మహదేవపుర, బొమ్మనహళ్లి ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. సాఫ్ట్వేర్ ఉద్యోగులు ట్రాక్టర్లలో ఆఫీసులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి బెంగళూరులో 1706 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. ఐటీ సిటీలో ఇంత భారీగా వర్షపాతం నమోదవడం ఇదే మొదటిసారి. గతంలో 2017లో 1696 మిల్లీమీటర్ల వర్షంపాతం కురిసింది.