ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో ముందంజలో తెలంగాణా
.. డీజీపీ మహేందర్ రెడ్డి
తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:
శాంతి భద్రతల పరిరక్షణలో తెలంగాణ పోలీస్ శాఖ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని డీజీపీ మహేందర్ రెడ్డి అన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగంలో దేశంలోనే ముందంజలో ఉన్నామని చెప్పారు. ఒకే రాష్ట్రం, ఒకే సేవ అనే సూత్రంతో స్నేహపూర్వక సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ గోషామహల్ స్టేడియంలో జరిగిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం కార్యక్రమానికి హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ మహేందర్ రెడ్డి హాజరయ్యారు. అమరులైన పోలీసులకు నివాళులర్పించారు. అనంతరం డీజీపీ మహేందర్ రెడ్డి మాట్లాడుతూ.. జవాబుదారీతనం, పారదర్శకత, బాధ్యతాయుత పోలీసు సేవలు అందిస్తున్నామని వెల్లడించారు. రాష్ట్రంలో 15 లక్షల సీసీ కెమెరాల ఏర్పాటే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. నేరం చేస్తే శిక్ష నుంచి తప్పించుకోలేని విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. పౌరుల భద్రతే లక్ష్యంగా పోలీసు శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చామని తెలిపారు.విధినిర్వహణలో ప్రాణాలర్పించిన అమరులకు నివాళులు అర్పిస్తున్నామన్నారు. ప్రతి ఏడాది అక్టోబర్ 21న పోలీసు అమరవీరుల దినోత్సవం జరుపుకుంటున్నామని చెప్పారు. ఈ ఏడాది 264 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులయ్యారని తెలిపారు. తెలంగాణను నేర రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. పోలీస్ సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని వెల్లడించారు. దేశంలోనే రాష్ట్ర పోలీసు వ్యవస్థ ముందుండటం గర్వంగా ఉందని డీజీపీ చెప్పారు.