గుండెపోటుతో 3వ తరగతి విద్యార్థి మృతి.. క్యూలో నిలబడి ఒక్కసారిగా

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం వెంకట్రావుపల్లిలో విషాద ఘటన చోటు చేసుకుంది. అభం శుభం తెలియని 8 ఏండ్ల విద్యార్థి గుండెపోటుకు గురై మరణించడం సంచలనం కల్గిస్తోంది. వివరాల్లోకి వెళ్తే.. బోయినపల్లి మండలం. వెంకట్రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో మూడో తరగతి చదువుతున్న కౌశిక్ అనే విద్యార్థి గుండె పోటుతో మృతి చెందడం కలకలం సృష్టించింది. మధ్యాహ్నం 12 గంటలకు మధ్యాహ్న భోజనం అందివ్వాల్సి ఉన్నప్పటికీ సూర్య గ్రహణం కారణంగా పదకొండు గంటలకు అందించారు. మధ్యాహ్న భోజనం కోసం క్యూ లైన్లో విద్యార్థులు నిలబడగా మూడో తరగతి చదువుతున్న బుర్ర కౌశిక్ ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. కౌశికు వెంటనే స్థానిక ఆర్ఎంపీని పిలిపించి చెకప్ చేయించారు. అనంతరం కరీంనగర్ హాస్పిటల్కు తీసుకెళ్లగా అప్పటికే కౌశిక్ మరణించాడని, హార్ట్ స్ట్రోక్ కారణంగా మరణించి ఉంటాడని వైద్యులు తెలిపారు. దీంతో వెంకట్రావుపల్లి గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఎనిమిదేళ్ల విద్యార్థి చలాకీగా ఉంటూనే మరణించడం స్థానికులను కలిచి వేసింది.

Leave A Reply

Your email address will not be published.