గాంధీజీ బోధనలు ప్రపంచానికి స్ఫూర్తిదాయకం
.. ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్
గాంధీ జయంతి సందర్భంగా మహాత్మా గాంధీ సేవలను ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ శనివారం స్మరించుకున్నారు. జాతిపిత మహాత్మా గాంధీకి ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఆయన 153 వ జయంతి సందర్భంగా స్వాతంత్య్ర ఉద్యమంలో సత్యం, అహింస మార్గం ఎంచుకుని మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచారని కొనియాడారు. గాంధీజీ బోధనలు ప్రపంచ నాయకులకు స్ఫూర్తిదాయకమని గవర్నర్ తన సందేశంలో పేర్కొన్నారు. సత్యం, అహింస సిద్ధాంతాలకు పునరంకితం అవుతాం అని ప్రతిజ్ఞ చేయాలని ప్రజలను కోరారు.‘దేశం కోసం మహాత్మా గాంధీ అత్యున్నత త్యాగం, శాశ్వతమైన బోధనలు మనకు ఎల్లప్పుడూ మార్గనిర్దేశం చేస్తాయి. గాంధీజీ బోధనలు ఎల్లప్పుడూ ప్రపంచ నాయకులకు ప్రేరణగా ఉన్నాయి. మహాత్ముడు చేపట్టిన శాంతియుత ప్రతిఘటన, సామూహిక శాసనోల్లంఘన మార్గాలను విశ్వవ్యాప్తంగా అనుకరించారు. గాంధీజీ చాలా సాదాసీదా జీవితాన్ని గడిపారు. తన అహింసా బోధనలతో భవిష్యత్ తరాలకు స్ఫూర్తినిచ్చారు. గాంధీ జయంతిని ప్రపంచవ్యాప్తంగా ‘అంతర్జాతీయ అహింసా దినోత్సవం’గా జరుపుకుంటారు. ఈ రోజున మనమందరం జాతిపిత అడుగుజాడల్లో నడుద్దామని ప్రతిజ్ఞ చేద్దాం. సత్యం, అహింస సూత్రాలకు పునరంకితమవుదాం’ అని రాజ్భవన్ నుంచి వెలువడిన ఒక ప్రకటనలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పేర్కొన్నారు.