భారత్ జోడో యాత్రలో ఆకట్టుకున్న కొమ్ముకోయ కళారూపం

.. కొమ్ము కోయ కళాకారులతో డ్యాన్సు చేసిన రాహుల్ జీ .. ఆదివాసీల కళారూపం గురించి వివరించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: భారత్ జోడో యాత్ర కల్చరల్ కమిటీ చైర్మన్, సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క ఏర్పాటు చేసిన ఖమ్మం జిల్లా ఆదివాసీలు ప్రదర్శించిన కొమ్ము కోయ డ్యాన్స్ ను రాహుల్ జీ మహబూబ్ నగర్ పాదయాత్రలోఆసక్తిగా తిలకించారు. స్ర్తీ, పురుషులు కలసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే కొమ్ము కోయ ప్రదర్శనలో కళాకారులతో కలిసి రాహుల్ జీ అడుగులు వేస్తూ ఉత్సాహ పరిచారు. ఆదివాసీల కళారూపం గురించి రాహుల్ జి కి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వివరించారు. “ఖమ్మంతోపాటు ములుగు, జయశంకర్‌ భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొండాకోనల్లో నివసించే ఆదివాసీలు తమదైన శైలిలో అనేకానేక కళారూపాలను సృష్టించారు. వాటిలో ‘కొమ్ము కోయ నృత్యం’ ప్రత్యేకమైంది, సృజనాత్మకమైంది. అడవి దున్న కొమ్ములు, నెమలీకల కలబోతతో.. అసలైన అందానికి అద్దం పడుతుంది. తలమీద ఎద్దు/ అడవి దున్న కొమ్ములతో చేసిన కిరీటం, దాని పైన నెమలి పింఛాలు ధరించి, మెడలో పెద్ద డోలు వేసుకొని చేసే ఈ నృత్య రూపకాన్ని ‘కొమ్ము డోలు’ అని కూడా వ్యవహరిస్తారు. పురుషులు కలసి లయబద్ధంగా అడుగులు వేస్తూ చేసే ప్రదర్శన అయినప్పటికీ, పురుషుల నృత్య పద్ధతి, స్త్రీల నృత్య పద్ధతికి కొంత వ్యత్యాసం ఉంటుంది. పురుషులు ప్రత్యేకమైన వస్త్రధారణతో డోళ్లను లయబద్ధంగా వాయిస్తూ, అడుగులో అడుగులు వేసుకుంటూ నృత్యం చేస్తారు. ఈ ప్రదర్శనను ‘పెర్మికోర్‌’ అని పిలుస్తారు. మహిళలు ఆకుపచ్చ చీరలు ధరించి, కొప్పులో పూలు పెట్టుకొని ఒకరిచేతులు ఒకరు పట్టుకొని ‘రేల’ పాటలు పాడుతూ నృత్యాన్ని ప్రదర్శిస్తారు. దీనిని ‘రేలా నృత్యం’” అని వ్యవహరిస్తారని వివరించారు. 10 నుంచి 15 మంది పురుషులు డోళ్లు వాయిస్తూ, లయబద్ధంగా అడుగులు కదిలిస్తూ వలయాకారంగా ‘పెరకోరు’అంటారని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.