బిహార్లో దారుణం.. గ్యాస్ సిలిండర్ పేలింది50 మందికి గాయలు
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: బిహార్లోని ఔరంగాబాద్లో దారుణం జరిగింది. ఛాత్ పూజలకు సన్నాహాలు చేస్తుండగా ఓ రెండంతస్థుల భవనంలో గ్యాస్ సిలిండర్ పేలింది. దీంతో దాదాపు 50 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఏడుగురు పోలీసు సిబ్బంది కూడా ఉన్నారు. వీరందరినీ సదర్ ఆసుపత్రికి తరలించి, చికిత్స చేయిస్తున్నారు. ఇరుకుగా ఉండే వీథుల్లో ఒకటైన ఒడియా గలీలో ఈ భవనం ఉంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, పాత జీటీ రోడ్లో ఉన్న మర్ఫీ రేడియో వీథిలో రెండంతస్థుల భవనంలో జనరల్ స్టోర్ను నిర్వహిస్తున్నారు. ఆ స్టోర్ యజమాని కుటుంబం ఛాత్ పూజల కోసం శనివారం ప్రసాదాన్ని తయారు చేస్తుండగా, తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో గ్యాస్ సిలిండర్ పెద్ద శబ్దంతో పేలింది. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు గాయపడ్డారు. మంటల్లో చిక్కుకుని ఏడుగురు పోలీసులతో సహా సుమారు 50 మంది గాయపడ్డారు.జనరల్ స్టోర్ యజమాని అనిల్ మాట్లాడుతూ, తాము ఛాత్ పూజ కోసం ఏర్పాట్లు చేస్తుండగా తన దుకాణంలోని గ్యాస్ సిలిండర్ పేలిందని చెప్పారు. తన కుటుంబ సభ్యులు ఈ ప్రమాదంలో గాయపడ్డారని తెలిపారు.ఛాత్ పూజలను బిహార్, ఉత్తర ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, నేపాల్లలో జరుపుకుంటారు. గంగా నదిలో స్నానమాచరించి, ఉపవాసం ఉంటారు. కార్తిక మాసం శుక్ల షష్ఠినాడు ఈ పండుగను జరుపుకుంటారు. సూర్యుడిని, ఆయన సోదరి ఛతి మయ్యాను పూజిస్తారు.