కస్తూర్బా పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణ
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: జిల్లాలోని దేవరుప్పుల కస్తూర్బా పాఠశాలలో జరిగిన ఘటనపై విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా కలెక్టర్ శివ లింగయ్య, ఆర్డీవో, సంబంధిత అధికారులతో కలిసి పాఠశాలను సందర్శించారు. పాఠశాల ఆవరణ, పరిసరాలు, వంట గది, భోజన హాల్ను మంత్రి పరిశీలించారు. విద్యార్థినీలు, ఉపాధ్యాయులు, సిబ్బంది తో వేర్వేరుగా సమావేశమై అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాల సిబ్బంది ఆలస్యంగా వచ్చి తొందరగా వెళ్లిపోతున్నారని విద్యార్థినీలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. తామే భోజనం వడ్డించుకుంటున్నామని వెల్లడించారు.భోజనంలో బల్లి పడి అస్వస్థతకు గురైన విద్యార్థినీల ఆరోగ్య పరిస్థితి గురించి మంత్రి వాకాబు చేశారు. ఈ ఘటనపై విచారణ జరిపి బాధ్యులపై వెంటనే చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. భోజనం వడ్డించే ఏజన్సీలకు తగు సూచనలు ఇచ్చి, ప్రభుత్వ నిబంధనలు క్రమం తప్పకుండా పాటించాలని పేర్కొన్నారు.