మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి

తెలంగాణ జ్యోతి/ వెబ్ న్యూస్:  

న‌ల్ల‌గొండ జిల్లా ప‌రిధిలోని మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్‌కు ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు రాష్ట్ర ఎన్నిక‌ల ప్ర‌ధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. ఇవాళ ఆయ‌న‌ మీడియాతో మాట్లాడారు. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 2,41,855 మంది ఓట‌ర్లు ఉన్నారు. ఇందులో 50 మంది స‌ర్వీస్ ఓట‌ర్లు ఉన్నారు. 5,686 పోస్ట‌ల్ బ్యాలెట్ ఓట్లు ఉన్న‌ప్ప‌టికీ, కేవ‌లం 739 మంది మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మొత్తం పోలింగ్ కేంద్రాలు 298 ఉన్నాయ‌న్నారు. అర్బ‌న్‌లో 35, రూర‌ల్‌లో 263 పోలింగ్ స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేసిన‌ట్లు తెలిపారు. 105 స‌మ‌స్యాత్మ‌క పోలింగ్ కేంద్రాల‌ను గుర్తించాం. మునుగోడు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో ఓట‌రు స్లిప్పుల పంపిణీ ఇప్ప‌టికే పూర్తయింద‌ని చెప్పారు. ఆన్‌లైన్‌లో కూడా ఓట‌రు స్లిప్పుల‌ను డౌన్ లోడ్ చేసుకోవ‌చ్చ‌ని సూచించారు. తొలిసారి కొత్త న‌మూనా ఓట‌రు కార్డుల‌ను పంపిణీ చేశామ‌ని తెలిపారు.

ఉద‌యం 7 నుంచి సాయంత్రం 6 వ‌ర‌కు పోలింగ్..

అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఉద‌యం 7 గంట‌ల నుంచి సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగనుంద‌ని పేర్కొన్నారు. అన్ని పోలింగ్ స్టేష‌న్ల‌లో మెడిక‌ల్ టీమ్స్‌ను అందుబాటులో ఉంచామ‌న్నారు. 3,366 పోలీసు సిబ్బందితో పాటు 15 కంపెనీల‌ కేంద్ర బ‌ల‌గాలు అందుబాటులో ఉన్నాయ‌న్నారు. నియోజ‌క‌వ‌ర్గం ప‌రిధిలో 100 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామన్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో రూ. 6.80 కోట్ల న‌గ‌దు స్వాధీనం చేసుకున్నాం. 4500 లీట‌ర్ల మ‌ద్యం సీజ్ చేశామ‌న్నారు. రేపు సాయంత్రం 6 గంట‌ల త‌ర్వాత నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలో విస్తృతంగా త‌నిఖీలు నిర్వ‌హిస్తామ‌న్నారు. ప్రత్యేక యాప్ ద్వారా గంట గంట‌కు ఓటింగ్ శాతాన్ని తెలియ‌జేస్తామ‌న్నారు. రేపు సాయంత్రం 6 త‌ర్వాత బ‌ల్క్ మేసేజ్‌లు వ‌స్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించారు.బ‌య‌ట‌నుంచి వ‌చ్చిన‌వారు నియోజ‌క‌వ‌ర్గంలో ఉండ‌కూడ‌దు. కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి వివ‌ర‌ణ‌ను ఈసీకి నివేదించామ‌ని వికాస్ రాజ్ మీడియాకు తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.