ములుగు జడ్పి ఛైర్మెన్ ను పరామర్శించిన కేటీఆర్

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గూండాల రాళ్ల దాడిలో గాయ‌ప‌డిన ములుగు జ‌డ్పీ చైర్మ‌న్ కుసుమ జ‌గ‌దీశ్‌ను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్, హోం మంత్రి మహమూద్ అలీ పరామర్శించారు.

అనంత‌రం మీడియాతో కేటీఆర్ గారు మాట్లాడారు…
హింస‌కే పాల్ప‌డుతామ‌నే సిద్ధాంతం మీది ఏదైతో ఉందో.. దాన్ని తిప్పికొట్టే శ‌క్తి, స‌త్తా మాకు ఉంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు.. కానీ మ‌ధ్య‌లో నలిగిపోయేది సామాన్యులు. భౌతికాదాడులు సరికాదు. హింస దేనికి ప‌రిష్కారం కాదు. చిల్ల‌ర ప‌నులు, మాట‌లు, ప్ర‌చారాలు బంద్ చేయండి. మీ చిల్ల‌ర మాట‌ల‌తో తెలంగాణ‌లో అగ్గిపెట్టే ప్ర‌య‌త్నం చేస్తే.. బుద్ధి చెప్పే స‌త్తా క‌చ్చితంగా ప్ర‌జ‌ల‌కు కూడా ఉంది అని కేటీఆర్ స్ప‌ష్టం చేశారు. మునుగోడులో ప‌రాభ‌వం త‌ప్ప‌ద‌ని తెలిసే అమిత్ షా మీటింగ్ ర‌ద్దు చేసుకున్నాడు. జేపీ న‌డ్డా కూడా రాలేదు. అందుకే మీరు దాడుల‌కు పాల్ప‌డుతున్నారు. బెంగాల్‌లో మీ వ‌ల్లే హింస ప్రారంభ‌మైంది. శ‌వాల మీద పేలాలు ఏరుకునే దౌర్బాగ్య సంస్కృతి బీజేపీ పార్టీది. ఈ రాజ‌కీయం బీజేపీకే సాధ్య‌మైత‌ది. నిన్న ప‌లివెల‌లో 12 మంది టీఆర్ఎస్ నాయ‌కుల‌ను గాయ‌ప‌రిచారు. ఇదే సంస్కృతిని కొన‌సాగిస్తే మేం తిర‌గ‌బ‌డ‌క త‌ప్ప‌దు. బుద్ది చెప్ప‌క త‌ప్పదు. సానుభూతి నాట‌కాలు మంచిది కాదు అని కేటీఆర్ హెచ్చ‌రించారు.

గ‌త 8 ఏండ్ల‌లో ఉద్రిక్త‌త‌కు తావు ఇవ్వ‌లేదు..

2001 నుంచి 2014 వ‌ర‌కు 14 ఏండ్ల పాటు ఎన్నో భావోద్వేగాల మ‌ధ్య‌న‌, ఎన్నో ర‌కాల ఒత్తిళ్ల మ‌ధ్య తెలంగాణ ఉద్య‌మాన్ని శాంతియుతంగా ముందుకు తీసుకెళ్లామ‌ని కేటీఆర్ గుర్తు చేశారు. ఒక్క చుక్క ర‌క్తం కూడా చిందించ‌కుండా, ప్ర‌జాస్వామ్య ప‌ద్ధ‌తుల్లోనే తెలంగాణ సాధించాల‌నే నిబద్ధ‌త‌తో, చిత్త‌శుద్ధితో, అన్ని ర‌కాల అవ‌రోధాల‌ను త‌ట్టుకోని ధీరోదాత్తంగా ప్ర‌జాస్వామ్య ప‌ద్ద‌తుల్లోనే తెలంగాణ సాధించింది టీఆర్ఎస్ పార్టీ. ఆ ఉద్య‌మానికి కేసీఆర్ నాయ‌క‌త్వం వ‌హించారు అని మంత్రి గుర్తు చేశారు. ఎన్న‌డూ కూడా కొట్లాట‌లు, హింస‌ల‌కు తావు ఇవ్వ‌లేదు. తెలంగాణ రాష్ట్రం వ‌చ్చిన త‌ర్వాత గ‌త 8 ఏండ్ల‌లో ఎక్క‌డ ఎన్నిక జ‌రిగినా కూడా ఉద్రిక్త‌త‌కు తావు ఇవ్వ‌లేదని కేటీఆర్ తెలిపారు.

రెచ్చ‌గొట్టే మాట‌లు మాట్లాడితే స‌హించం..

ఈ బీజేపీ నాయ‌కులు వారి ఆగ‌డాలు, ముఖ్యంగా ఇవాళ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం హింస‌ను రెచ్చ‌గొట్టాలి. శాంతిభ‌ద్ర‌త‌ల స‌మ‌స్య‌ల‌ను సృష్టించాల‌నే వ్యూహంతో దానిక‌నుగుణంగానే నిన్న ప‌లివెల‌లో పెద్ద ఎత్తున రాజేంద‌ర్ నాయ‌క‌త్వంలో బీజేపీ కార్య‌క‌ర్త‌లు దాడుల‌కు దిగారు. ఎమ్మెల్సీ ప‌ల్లా రాజేశ్వ‌ర్ రెడ్డి, ములుగు జ‌డ్పీ చైర్మ‌న్ కుసుమ జ‌గ‌దీశ్ తో పాటు 12 మంది కార్య‌క‌ర్త‌ల త‌ల‌లు ప‌గొగ‌లుగొట్టారు. క‌ర్ర‌ల‌తో దాడి చేశారు. మొత్తం ఫోటోలు, వీడియోలు ఉన్నాయి. ఎవ‌రు ఎవ‌రి మీద దాడి చేశార‌నే ఆధారాలు ఉన్నాయి. ఈటల రాజేంద‌ర్ పీఏ న‌రేశ్ అనే వ్య‌క్తి రాళ్ల‌తో దాడి చేసిన ఫోటోలు ఉన్నాయి. మా ప్ర‌చారం మేం చేసుకుంటుంటే మాపై దాడి చేసి, సానుభూతి కోసం నాట‌కాలు ఆడుతున్నారు. మీరు పిడికెడంత మంది ఉన్నారు. మాకు 60 ల‌క్ష‌ల మంది కార్య‌క‌ర్తులు ఉన్నారు. రెచ్చ‌గొట్టే మాట‌లు మాట్లాడితే.. స‌హించం అని కేటీఆర్ తేల్చిచెప్పారు.

Leave A Reply

Your email address will not be published.