వెంటాడిన మృత్యువు .. ఫ్రిడ్జ్ పేలి ముగ్గురు మృతి

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఇంటిలోని ఫ్రిజ్ పేలి ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషాదకర ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. చెన్నై సమీపంలోని కోదండరామ్ నగర్‌లో శుక్రవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఫ్రిజ్‌ పేలి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఊపిరాడక మృతిచెందారు. ఈ ఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. చెంగల్పట్టు జిల్లా కోదండరామ్‌ నగర్‌ ఉర్పాకమ్ రైల్వే స్టేషన్ సమీపంలోని ఆర్ఆర్ బృందావన్ అపార్ట్‌‌మెంట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో మృతిచెందినవారిని గిరిజ (63), ఆమె సోదరి రాధ (55), బంధువు రామ్‌ కుమార్ (47)గా గుర్తించారు. ఈ ఘటనలో రామ్ కుమార్ భార్య భార్గవి (35), కుమార్తె ఆరాధాన (6) తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. వీరికి ప్రస్తుతం క్రోమ్‌పేట్ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. రామ్ కుమార్ తన కుటుంబంతో కలిసి గురువారం ఉదయమే దుబాయ్ నుంచి వచ్చినట్టు పోలీసులు తెలిపారు. గతేడాది అనారోగ్యంతో మరణించిన గిరిజ భర్త ఆబ్దికం కోసం రామ్‌కుమార్ దంపతులు వచ్చి మృత్యువాత పడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే పేలుడు సంభవించినట్టు భావిస్తున్నారు. పేలుడు శబ్దంతో మేల్కొన్న పొరుగింటివారు గిరిజ ఇంటి తలుపులు తెరిచి కాపాడే ప్రయత్నం చేశారు. తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. కుదువంచెరి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం తరలించారు.

Leave A Reply

Your email address will not be published.