తెలంగాణలో మరో ఉప ఎన్నిక?

తెలంగాణ  జ్యోతి/వెబ్ న్యూస్: తెలంగాణలో 2018లో అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత కొన్ని ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక, నాగార్జున సాగర్, హుజుర్‌నగర్, హుజురాబాద్, మునుగోడులో ఉప ఎన్నికలు జరిగాయి. దుబ్బాక, నాగార్జునసాగర్‌లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మృతితో ఉప ఎన్నికలు అనివార్యం అయ్యాయి. హుజుర్‌నగర్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి రాజీనామాతో ఉప ఎన్నిక వచ్చింది. ఆయన ఎంపీగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. హుజురాబా‌ద్‌లోనూ ఉప ఎన్నిక వచ్చింది. ఈటల రాజేందర్-కేసీఆర్ మధ్య జరిగిన వ్యవహారంతో ఉప ఎన్నిక తథ్యం అయ్యింది.

ఇవన్నీ అయిపోయాక.. తాజాగా మునుగోడు తెరపైకి వచ్చింది. మిగతా ఎన్నికలకు.. మునుగోడుకు ఏమాత్రం పోలిక లేదు. బీజేపీ కావాలనే మునుగోడులో ఉప ఎన్నికను తీసుకొచ్చిందనే విమర్శలు ఉన్నాయి. తెలంగాణలో కేసీఆర్‌ను రాజకీయంగా ఉక్కిరిబిక్కిరి చేయడానికి బీజేపీ ఉప ఎన్నికలను అస్త్రంగా వాడుతోంది. ఈ నేపథ్యంలోనే.. మునుగోడులో గెలిచి టీఆర్ఎస్ పార్టీని ఢీకొట్టేది తామేనని నిరూపించుకోవడానికి బీజేపీ వ్యూహం రచించింది. కానీ.. అది బూమరాంగ్ అయ్యింది. బీజేపీ అనుకున్న ఫలితం దక్కలేదు. ఆ ఎన్నికలో ఓటమిపై బీజేపీ సమీక్షలు మొదలుపెట్టింది.

ఇంకా మునుగోడు వేడి తగ్గలేదు. అప్పుడే తెలంగాణలో మరో ఉప ఎన్నిక రావొచ్చు అనే ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడలో ఉప ఎన్నిక వస్తుందని.. కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే.. ఎవరో సామాన్య వ్యక్తులు పోస్టులు చేస్తే కొట్టి పారేయొచ్చు. కానీ.. కొంతమంది ప్రముఖులు కూడా దీని గురించి పోస్టులు పెడుతున్నారు. దీంతో తెలంగాణలో కొత్త చర్చ మొదలైంది. అయితే.. అసలు వేములవాడలో ఉప ఎన్నిక ఎందుకు వస్తుందనే చర్చ కూడా జరుగుతోంది. దానికి కొన్ని కారణాలు ఉన్నాయి.

వేములవాడ ప్రస్తుత ఎమ్మెల్యే చెన్న‌మ‌నేని ర‌మేష్ బాబు పౌరసత్వంపై.. చాలా రోజులుగా కోర్టులో వాదనలు నడుస్తున్నాయి. అయితే.. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ హైకోర్టుకు కీలక విషయం నివేదించింది. చెన్నమనేని రమేష్ బాబుకు శాసనసభ్యుడిగా కొనసాగే అర్హత లేదని తెలంగాణ హైకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆయనకు జర్మనీ పౌరసత్వం ఉందని స్పష్టం చేసింది. కేంద్ర ప్ర‌భుత్వం త‌రుఫున అడిష‌న‌ల్ సొలిసిట‌ర్ జ‌న‌ర‌ల్ టి.సూర్య‌క‌ర‌ణ్ రెడ్డి ఇటీవల హైకోర్టుకు హాజ‌రై వాద‌న‌లు వినిపించారు. వేములవాడ ఎమ్మెల్యేకు రెండు పౌర‌స‌త్వాలు ఉన్నాయ‌ని చెప్పారు.

2019లోనే కేంద్ర హోంమంత్రిత్వ శాఖ చెన్న‌మ‌నేని పౌరస‌త్వాన్ని ర‌ద్దు చేస్తూ నిర్ణ‌యం తీసుకుంద‌ని కేంద్రం స్పష్టం చేసింది. ఈ పౌర‌స‌త్వం అంశం చాలా ప్ర‌ధాన‌మైంద‌ని.. ఆయ‌న పౌర‌స‌త్వం ర‌ద్దు చేయ‌డం చ‌ట్ట‌ప‌రంగా స‌రైందేన‌ని కోర్టుకు తెలిపింది. అయితే.. దీనిపై హైకోర్టు ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. త్వరలోనే చెన్న‌మ‌నేని పౌరసత్వంపై క్లారిటీ రానుంది. ఈ నేపథ్యంలో వేములవాడతో ఉప ఎన్నిక రాబోతోందని ప్రచారం జరగడం చర్చనీయాంశం అయ్యింది.

Leave A Reply

Your email address will not be published.