రూ.18 కోట్ల రూపాయల అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి తలసాని
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: సనత్ నగర్ నియోజకవర్గ పరిధిలో 50 సంవత్సరాలలో జరగని అభివృద్ధి 8 సంవత్సరాలలో జరిగిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. గురువారం అమీర్ పేట, సనత్ నగర్ డివిజన్ లలో 2.18 కోట్ల రూపాయల విలువైన పలు అభివృద్ధి పనులను ప్రారంభించారు. ముందుగా అమీర్ పేట డివిజన్ లోని సోనాబాయి టెంపుల్ వద్ద 60 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న VDCC రోడ్డు నిర్మాణ పనులను, బల్కంపేట రోడ్డులోని బృందావన్ హోటల్ సమీపంలో 75 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న CC రోడ్డు నిర్మాణ పనులను, సనత్ నగర్ డివిజన్ లోని C టైప్ కాలనీలో 50 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వివేకానంద కమిటీ హాల్ నిర్మాణం, చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ జిమ్ ఏర్పాటు పనులను ప్రారంభించారు. 15 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన రవీంద్రనగర్ కమిటీ హాల్ మొదటి అంతస్తు ను ప్రారంభించారు. అదేవిధంగా అల్లా ఉద్దిన్ కోటి లో 13.80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న వాటర్ పైప్ లైన్ పనులను ప్రారంభించారు. సోనాబాయి టెంపుల్ వద్ద గల హరిజన బస్తీలో అధికారులతో కలిసి మంత్రి పర్యటించి బస్తీ వాసుల సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ సమస్య తీవ్రంగా ఉందని, పరిష్కరించాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి డ్రైనేజీ సమస్య శాశ్వత పరిష్కారం కోసం త్వరితగతిన నూతన పైప్ లైన్, రోడ్డు నిర్మాణం కోసం చర్యలు తీసుకోవాలని EE ఇందిరా, వాటర్ వర్క్స్ GM హరి శంకర్ లను మంత్రి ఆదేశించారు.