దసరా రోజు మీటింగ్ పై క్లారిటీ ఇచ్చిన కెసిఆర్
తెలంగాణ భవన్లో దసరా ఉదయం 11 గంటలకు తలపెట్టిన టిఆర్ఎస్ పార్టీ జనరల్ బాడీ మీటింగ్పై టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి క్లారిటీ ఇచ్చారు. జాతీయ పార్టీపై ప్రకటన కోసం ఈ నెల 5న దసరా రోజు టీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కీలక సమావేశం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ రోజు మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో ఈ సమావేశం ఉంటుందా ? లేక ? వాయిదా పడుతుందా అనే చర్చ మొదలైంది. అయితే ఈ అంశంపై గులాబీ బాస్ కేసీఆర్ (KCR) మరోసారి క్లారిటీ ఇచ్చారు. తెలంగాణ భవన్లో దసరా ఉదయం 11 గంటలకు తలపెట్టిన టిఆర్ఎస్ (TRS) పార్టీ జనరల్ బాడీ మీటింగ్ యధావిధిగా జరగుతుందని టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికల నోటిఫికేషన్ నేపథ్యంలో దాని ప్రభావం, దసరా నాటి టిఆర్ఎస్ సర్వసభ్య సమావేశం పైన ఉండదని., సభ్యులు అనుమానాలకు గురికావద్దని అన్నారు. ముందుగా ప్రకటించినట్టే అక్టోబర్ 05 వ తేదీన ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్ లో పార్టీ సర్వసభ్య సమావేశం కొనసాగుతుందని సిఎం కెసిఆర్ పునరుద్ఘాటించారు. అందరూ నిర్దేషిత సమయం లోపే హాజరుకావాలన్నారు. చాలాకాలం నుంచి జాతీయ పార్టీని ఏర్పాటు చేయాలని కసరత్తు చేస్తున్న టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ .. దీనిపై తుది నిర్ణయం తీసుకున్నారు. దీనిపై పార్టీ నేతలతో చర్చించారు. దసరా రోజున టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో సమావేశం ఏర్పాటు చేసి దీనిపై ప్రకటన చేయాలని డిసైడయ్యారు. అయితే నేడు మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ విడుదల కావడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందా ? లేక ? మునుగోడు ఉఫ ఎన్నిక తరువాత దీనిపై ప్రకటన చేస్తారా ? అనే చర్చ టీఆర్ఎస్ వర్గాలతో పాటు రాజకీయవర్గాల్లోనూ మొదలైంది. దీంతో టీఆర్ఎస్ శ్రేణులు ఎలాంటి గందరగోళానికి లోనుకాకుండా ఉండేందుకు స్వయంగా సీఎం కేసీఆర్ దీనిపై ప్రకటన చేశారు. దసరా రోజు జాతీయ పార్టీ ప్రకటన కోసం ఏర్పాటు చేసిన సమావేశం షెడ్యూల్ ప్రకారమే ఉంటుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే అన్ని ప్రధాన రాజకీయ పార్టీలకు అత్యంత ప్రతిష్ఠాత్మకమైన మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలయింది. కాసేపటి క్రితం కేంద్ర ఎన్నికల సంఘం దీనికి సంబంధించిన ప్రకటనను విడుదల చేసింది. దేశంలోని పలు రాష్ట్రాల ఉప ఎన్నికలతో పాటు మునుగోడుకు కూడా షెడ్యూల్ని సీఈసీ వెలువరించింది. ఇందుకు సంబంధించిన ఈ నెల 7 నోటిఫికేషన్ విడుదలవుతుంది. నామినేషన్ల దాఖలుకు 14న చివరి తేదీ. నామినేషన్ల ఉపసంహరణకు అక్టోబర్ 17 చివరి తేదీ. నవంబర్ 3న పోలింగ్ జరగనుండగా నవంబర్ 6న ఫలితాలు వెలువడనున్నాయి.