త్వరలో పెరగనున్న హైదరాబాద్ మెట్రో ఛార్జీలు

తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: హైదరాబాద్ మెట్రో రైలు ప్రయాణికులకు త్వరలోనే చేదువార్త అందనుంది. హైదరాబాద్ మెట్రో రైలు ఛార్జీలను పెంచేందుకు రంగం సిద్దమైంది. ఛార్జీల పెంపుపై కేంద్ర ఫేర్ ఫిక్సేషన్‌ కమిటీకి హైదరాబాద్ మెట్రో అధికారులు ప్రతిపాదనలు పంపారు. మెట్రో రైలు ఛార్జీల సవరణకు సంబంధించి ప్రజల అభ్యంతరాలు, సూచనలు, సలహాలను అందజేసేందుకు ఫెయిర్‌ ఫిక్సేషన్‌ కమిటీ ఇచ్చిన గడువు రేపటి (మంగళవారం)తో ముగియనుంది. పలు సంస్థలు, వ్యక్తులు, రాజకీయ పార్టీల నుంచి కమిటీకి పోస్ట్, మెయిల్‌ ద్వారా లేఖలు అందుతున్నాయి. వీటిని కమిటీ ముందే తెరవనున్నారు.మెట్రో రైలు ఛార్జీలను పెంచుకునేందుకు ఇక్కడి అధికారులకు అధికారం ఉండదు. కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫేర్ ఫిక్సేషన్ కమిటీకి మాత్రమే మెట్రో ఛార్జీల పెంపు అధికారం కల్పించారు. మెట్రో సేవలు ప్రారంభించిన సమయంలో మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్(ఎంఆర్ఏ) ఛార్జీలను ఫిక్స్ చేస్తోంది. మెట్రో రైలు సేవలు మొదలై ఈ నెలతో ఐదేళ్లు కావొస్తున్న తరుణంలో ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రో రైలు సంస్థ, రాష్ట్రం అభ్యర్థన మేరకు ఛార్జీలను ఫిక్స్ చేసేందుకు విశ్రాంత హైకోర్టు న్యాయమూర్తి గుడిసేవ శ్యామ్‌ ప్రసాద్‌ ఛైర్మన్‌గా, కేంద్ర గృహ, పట్టణ వ్వవహారాల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ సురేంద్ర కుమార్‌ బగ్దె, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ సభ్యులుగా కమిటీని ఏర్పాటు చేశారు. సెప్టెంబర్‌లో హైదరాబాద్‌లో సమావేశమైన ఈ కమిటీ ప్రస్తుతమున్న ఛార్జీల సవరణకు సంబంధించి తమ అభిప్రాయాలు, సలహాలను నవంబరు 15వ తేదీలోగా తెలపాలని కోరింది. ఫెయిర్‌ ఫిక్సేషన్‌ కమిటీ ఇచ్చిన గడువు రేపటితో ముగియనుంది. ఆ తర్వాత అభ్యంతరాలు, సూచనలను త్రిసభ్య కమిటీ ప్రత్యేకంగా సమావేశమై పరిశీలించనుంది. ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రో సంస్థ ఇచ్చే ఛార్జీల పెంపు ప్రతిపాదనలను పరిశీలించనుంది. నిర్వహణ వ్యయం వాస్తవ పరిస్థితులను తెలుసుకునేందుకు ఒక స్వతంత్ర సంస్థతో అధ్యయనం చేయించనుంది. ఈ మొత్తం ప్రక్రియను మూడు నెలల్లో పూర్తి చేయాల్సి ఉంటుందని మెట్రో వర్గాలు చెబుతున్నాయి. మెట్రో ఛార్జీలు ఇప్పుడు పెంచితే మళ్లీ ఐదేళ్ల తర్వాతనే సవరణకు అవకాశం ఉంటుంది.. కాబట్టి భారీగా పెంచే అవకాశం ఉందని మెట్రో అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం మినిమం ఛార్జీ రూ.10 ఉండగా.. మ్యాగ్జిమం ఛార్జీ రూ.60 వరకు ఉంది. దాన్ని సవరణ చేసి మినిమం ఛార్జీ రూ. 20 రూపాయలు.., మ్యాగ్జిమం ఛార్జీ రూ. 100 చేయనున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది జనవరి నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్నట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.