ఇరాన్ నుంచి చైనాకు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు
అప్రమత్తమైన భారత వైమానిక దళం
ఇరాన్ నుంచి చైనాకు వెళ్తున్న విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. సోమవారం ఉదయం విమానం భారత భూభాగంలో ఉండగా.. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు వచ్చింది. దీంతో వెంటనే విమానాన్ని న్యూఢిల్లీలో ల్యాండ్ చేసేందుకు అనుమతి కోరగా.. జైపూర్లో విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయాలని ఢిల్లీ ఏటీసీ సూచించింది. ఆ తర్వాత సమాచారం అందుకున్న భారత వైమానిక దళానికి చెందిన యుద్ధ విమానాలు ఆ విమానాన్ని అనుసరించాయి. ఏటీసీ ఢిల్లీలో అనుమతించకపోవడంతో పైలట్ విమానాన్ని చైనా గగనతలం దిశగా మళ్లించారు. ప్రస్తుతం భద్రతా సంస్థలు విమానాన్ని పర్యవేక్షిస్తున్నాయి.సదరు విమానం ఇరాన్లోని టెహ్రాన్ నుంచి చైనాలోని గ్వాంగ్జౌకు వెళ్తున్నట్లు ఢిల్లీ ఏటీసీ వర్గాలు తెలిపాయి. బాంబు బెదిరింపు గురించి సమాచారం అందుకున్న విమానయాన సంస్థ ఢిల్లీ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేయాలని సూచించింది. ఆ తర్వాత ఢిల్లీ ఏటీసీని సంప్రదించగా.. ఏటీసీ జైపూర్కు వెళ్లాలని సూచించింది. అనంతరం పైలట్ భారత గగనతలం నుంచి విమానాన్ని మళ్లించాడు. విమానంలో బాంబు ఉన్నట్లు సమాచారం అందిన వెంటనే భారత భద్రతా సంస్థలు అప్రమత్తమయ్యాయి. భారత వైమానిక దళం అప్రమత్తమై.. రెండు విమానాలను ఇరాన్ విమానం వెనుక పంపారు. అయితే, ఇప్పటి వరకు విమానంలో బాంబు ఉన్నట్లు నిర్ధారణ కాలేదని తెలుస్తున్నది.