2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం వినాశనమే
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: గుజరాత్ సహా దేశ వ్యాప్తంగా బీజేపీ పట్ల ప్రజల్లో తీవ్రమైన అసంతృప్తి పెరుగుతోందని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా స్పష్టం చేశారు. దీంతో బీజేపీ నేతల్లో వణుకు, భయం మొదలైందన్నారు. గుజరాత్ ఎన్నికల ప్రచార సభల్లో మోదీ, అమిత్ షా ప్రసంగాలను పరిశీలిస్తే, ఆ నేతల్లో నిరాశ, భయాందోళనలు కనబడుతున్నాయన్నారు. 2024లో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే దేశం వినాశనమవుతుందని రాజా పేర్కొన్నారు. సీపీఐ జాతీయ కార్యదర్శిగా రెండోసారి ఎన్నికైన తర్వాత డీ రాజా హైదరాబాద్కు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తక్కెళ్లపల్లి శ్రీనివాస్ రావు అధ్యక్షతన మగ్దూం భవన్లో జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశానికి డీ రాజా ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బీజేపీ పట్ల ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తి నేపథ్యంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతాయన్నది ఉత్కంఠగా మారిందన్నారు. త్వరలో జరిగే త్రిపుర, నాగాలాండ్ ఎన్నికల ఫలితాలపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోందన్నారు. బీజేపీ మరోసారి అధికారంలో కొనసాగితే దేశ వినాశనం తప్పదని హెచ్చరించారు. కనిష్ఠ ప్రభుత్వం, గరిష్ఠ పరిపాలన అందిస్తానని తొలిసారి ప్రధాని బాధ్యతలు చేపట్టినప్పుడు నరేంద్ర మోదీ హామీ ఇచ్చారని, అందుకు భిన్నంగా నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తూ నిరంకుశ విధానాలను అమలు పరుస్తున్నారని విమర్శించారు. దేశాన్ని వినాశనం దిశగా తీసుకుపోతున్నారని మండిపడ్డారు. దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని, లౌకిక వ్యవస్థలను పరిరక్షించుకోవాలంటే బీజేపీ, ఆర్ఎస్ఎస్ కలయికను 2024 ఎన్నికల్లో తప్పక ఓడించాలని రాజా పిలుపునిచ్చారు.జాతీయ స్థాయిలో బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఫాసిస్టు శక్తులను ఏకాకిని చేసి 2024 ఎన్నికల్లో ఓడించాలని, ఇందుకు వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర పార్టీలు, శక్తులు, ప్రాంతీయ పార్టీల ఐక్యతను మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉన్నదని రాజా చెప్పారు. తెలంగాణలో కూడా ఇదే రాజకీయ అవగాహనతో ముందుకు సాగుతామని స్పష్టం చేశారు. జీవనోపాధి సమస్యలపై ప్రజలను సమీకరించి పోరాటాలు నిర్వహించడం ద్వారా కమ్యూనిస్టు పార్టీని శక్తివంతం చేయాలని పార్టీ శ్రేణులకు రాజా పిలుపునిచ్చారు.