సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
తెలంగాణ జ్యోతి/వెబ్ న్యూస్: ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఓ అంతర్రాష్ట సైబర్ నేరగాడిని అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి సుమారు రూ. 2.05కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. లోన్ యాప్ ద్వారా వేధింపులకు పాల్పడుతున్న ఉత్తర ప్రదేశ్కు చెందిన అంతర్రాష్ట్ర లోన్ యాప్ కమీషన్ ఏజెంట్ జలాల్ ఖాన్ను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు.బద్వేల్ ప్రాంతానికి చెందిన మోహన్ అనే బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరిపి జలాల్ ఖాన్ను అదుపులోకి తీసుకుని విచారించగా పాల్పడ్డ సైబర్ నేరాలను అంగీకరించారని తెలిపారు. 14 రాష్ట్రాలలో సైబర్ క్రైమ్ నేరాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైందని, అతడి వద్ద ఏడు బ్యాంక్ అకౌంట్లను గుర్తించి రూ. 2.05 కోట్ల నగదు సీజ్ చేసినట్లు వెల్లడించారు.మరో ముగ్గురు లోన్ యాప్ నిర్వాహకుల కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వివరించారు. సైబర్ క్రైమ్, లోన్యాప్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ జిల్లా ప్రజలకు సూచించారు.